తెలంగాణలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ వరుసగా సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల్లో పనితీరు సక్రమంగా లేని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ వరుసగా వార్నింగ్ల మీద వార్నింగులు ఇస్తున్నారు. మరికొందరికి అయితే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కూడా కష్టమే అని తేల్చేశారట. ఇక జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్లమెంటరీ శాసనససభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మూడో రిపోర్టును బయట పెడతారన్న వార్తలతో ఇప్పుడు గులాబి పార్టీ ప్రజాప్రతినిధుల్లో గుబులు రేగుతోంది.
తెలంగాణలో అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధుల పనితీరుపై కేసీఆర్ ప్రతి మూడు నెలలకు ఓసారి సర్వే చేస్తున్నారు. ప్రోగ్రెస్ రిపోర్టుల్లో వరుసగా తక్కువ మార్కులు వస్తోన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్టు రాకుండా ఎర్త్ పెడతాడో ? అని భయంతో ఉన్నారట. తొలి సర్వేల్లో మంచి మార్కులతో కేసీఆర్ వద్ద శభాష్ అనిపించుకున్న చాలా మంది నాయకులు రెండో సర్వేలో డిజాస్టర్ పెర్పామెన్స్తో ఆయన చేత చీవాట్లు తిన్నారు.
గత సర్వేల్లో మంత్రులు జగదీష్రెడ్డి, మహేందర్రెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి, జోగు రామన్న, చందూలాల్, పద్మారావు మంచి మార్కులు రాలేదు. వీరికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక వీరిలో ఇప్పటకీ చాలా మంది మంత్రులు తమ పనితీరు మెరుగుపర్చుకోలేదు. దీంతో వారికి కేబినెట్ ప్రక్షాళన జరిగితే పోస్టులు ఊస్టింగ్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఆరుగురు మంత్రుల గుండెల్లో రైళ్లే పరిగెడుతున్నాయట.
ఇక ఈ ఆరుగురు మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేల పనితీరు సైతం వరస్ట్గా ఉందని సర్వేలో తేలినట్టు పార్టీ వర్గాల్లో ఇన్నర్ టాక్. కేసీఆర్ తలచుకుంటే ఏదైనా చేస్తారు. దీంతో వీరిలో ఎవరికి వచ్చే ఎన్నికల వేళ కేసీఆర్ షాక్ ఇస్తారా ? అని ఒకటే టెన్షన్ స్టార్ట్ అయ్యింది.