అమెరికా-ఉత్తర కొరియాలు ఫ్రెండ్స్ అవుతాయా? భారత్ కన్నా ఎక్కువగా ఉత్తరకొరియా అమెరికాకి వ్యూహాత్మక భాగస్వామి అవుతుందా? ఏమో చెప్పలేం! పరిస్థితులు, అంతర్జాతీయ ఒత్తిడుల నేపథ్యంలో ఈ రెండు దేశాలు చెలిమి దిశగా చెట్టాపట్టాలేసుకుని తిరిగినా ఆశ్చర్యం అనిపించక మానదు!! అయితే, ఏపీకి చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలు మాత్రం మారేలా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా.. కూడా ఆ ఇద్దరూ తమ పంథా వీడడం లేదట! వారిద్దరే ఒకరు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాగా, రెండో వారు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి. వీరిద్దరి మధ్య కొన్ని దశాబ్దాలుగా నెలకొన్ని వివాదం నేటికీ సమసి పోకపోగా.. మరింతగా అంటుకట్టడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
గతంలో ఇద్దరూ కాంగ్రెస్లో కీలకంగా ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచే రాజకీయాల్లోకి వచ్చిన ఈ ఇద్దరు నేతలు తర్వాత తర్వాత రాజకీయ వైరుధ్యాలతో కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్లొ నిజంగా కష్టపడే వారికి కిరణ్ మొండి చేయి చూపుతున్నారని, అధిష్టానాన్ని అగౌరవ పరిచేవారికి, నేతలను తూలనాడే వారికి పెద్ద పీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇక, ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరువురూ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అప్పట్లో వైఎస్కు ఎంతో సన్నిహితంగా ఉండడం వల్ల తర్వాత పెద్ది రెడ్డి జగన్ పంచకు చేరిపోయారు. ఆయన పెట్టిన పార్టీలో పుంగనూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, కిరణ్ కుమార్ రెడ్డి.. రాజకీయాలకు దూరమయ్యారు.
ఇక, ఇప్పుడు 2019 ఎన్నికల వేడి రాజుకుంటోంది. దీంతో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత వైసీపీలోకి వెళ్లాలని భావించినా.. అక్కడ పెద్దిరెడ్డి ఉండడంతో ఆయన వెనక్కి తగ్గారు. తనతో ఎంత మాత్రం గిట్టని బాబు చెంతకైనా చేరేందుకు సిద్ధపడ్డారు కానీ, పెద్ది రెడ్డి ఉన్న వైసీపీలోకి మాత్రం వెళ్లకూడదని డిసైడ్ అయ్యారట. మరోపక్క, పెద్ది రెడ్డి కూడా వైసీపీ వైఫల్యాలను మూటగట్టుకుంటోందని భావించి ఆ పార్టీ నుంచి కూడా బయటకు రావాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీలోకి వెళ్లాలని అనుకున్నారు. అయితే, కిరణ్ టీడీపీలోకి వెళ్తున్నారని తెలియడంతో ఆయన యూటర్న్ తీసుకున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. మరి ఈ ఇద్దరు ఎప్పటికి మారతారో చూడాలి!!