టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య‌లో లేడీ

తెలంగాణ‌లో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన ఖ‌మ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే మ‌ధ్య జ‌రుగుతోన్న పోరులో పార్టీ కార్య‌క‌ర్త‌లు న‌లిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్ద‌రూ త‌మ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖ‌మ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మ‌ద‌న్‌లాల్‌, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్ద‌రూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు, గ‌త ఎన్నిక‌ల్లోను వీరిద్ద‌రి మ‌ధ్య ఎంతో స‌ఖ్య‌త ఉండేది.

అయితే వీరు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేశాక వీరిద్ద‌రి మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. ఇద్ద‌రూ వైరా నియోజ‌క‌వ‌ర్గంలో ఆధిప‌త్యం కోసం ఫైటింగ్‌కు దిగుతున్నారు. ఎంపీ ముందునుంచి త‌న‌కంటూ నియోజ‌క‌వ‌ర్గంలో ఓ వ‌ర్గాన్ని మెయింటైన్ చేసుకుంటూ వ‌చ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ మారినా ఆ వ‌ర్గం ఎంపీతోనే ఉంటోంది త‌ప్పా ఎమ్మెల్యేతో క‌ల‌వ‌డం లేదు.

నియోజ‌వ‌ర్గ కేంద్ర‌మైన వైరాతో పాటు కొణిజెర్ల మండ‌లాల్లో ఎంపీకి ఓ గ్రూప్‌, ఎమ్మెల్యేకు మ‌రో గ్రూప్ ఉన్నాయి. తాజాగా వైరా డీఎస్పీ మార్పుకోసం ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ మ‌ధ్య వార్ జ‌రిగింది. మ‌ద‌న్‌లాల్ డీఎస్పీ బ‌దిలీ ఆపేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసికొట్టాయి. ఎంపీ త‌న సామాజికవ‌ర్గానికే చెందిన వ్య‌క్తిని డీఎస్పీగా నియ‌మించుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఎంపీపై మండిప‌డుతున్నారు.

ఇక ఎంపీ పొంగులేటి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌స‌ర‌మైతే మ‌ద‌న్‌లాల్‌ను ప‌క్క‌న పెట్టేలా వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రావ‌తిని ఎంక‌రేజ్ చేస్తున్నారు. 2009లో సీపీఐ నుంచి గెలిచిన ఆమె గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆమెపై గెలిచిన మ‌ద‌న్‌లాల్ టీఆర్ఎస్‌లోకి రావ‌డంతో చంద్రావ‌తి ప్రాధాన్యం త‌గ్గింది. ఇక ఇప్పుడు శ్రీనివాస్‌రెడ్డి వ్యూహాత్మ‌కంగా మ‌ద‌న్‌లాల్ ప్ర‌యారిటీ త‌గ్గించేందుకు ఆ మాజీ లేడీ ఎమ్మెల్యేను ఎంక‌రేజ్ చేస్తున్నారు. అయితే చంద్ర‌వ‌తికి ఎంపీ స‌పోర్ట్ చేస్తుంటే మ‌ద‌న్‌లాల్‌కు మంత్రి తుమ్మ‌ల అండ‌దండ‌లు ఉన్నాయి. దీంతో వైరా రాజ‌కీయం ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారింది.