రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఎదురవుతుందో చెప్పడం కష్టం. ముఖ్యంగా పదవులపై ఆశలు పెట్టుకున్న వారి విషయంలో వారు ఏ పార్టీకి పరిమితం అవుతారు? అని చెప్పడం ఇంకా కష్టం. నిన్న మొన్నటి వరకు పదవులపై ఆశలతోనే వైసీపీ నుంచి టీడీపీకి వరుస పెట్టి జంప్ చేసిన నేతలను మనం చూశాం. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు పాటుపడుతున్నారని అందుకే తాము పార్టీ మారామని చెప్పుకొచ్చిన నేతలు ఎక్కడ తమకు అనుకూలంగా ఉంటే అక్కడి జంప్ చేయడానికి సిద్ధంగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రాన్ని టీడీపీలో ఉన్న నేతలు పాటించేందుకు రెడీ అవుతున్నారట.
విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికలకు కేవలం రెండేళ్ల లోపే సమయం ఉంది. దీంతో ఇప్పుడు సీట్ల విషయం అన్ని రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గాల పెంపు విషయం ఇంకా తేలలేదు. దీంతో సిట్టింగులే కాకుండా ఆశావహుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో తమకు ఎవరు టికెట్ ఇస్తే.. వారి పంచన చేరిపోయేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఎప్పుడెప్పుడు వైసీపీలోకి వచ్చేద్దామా? అని ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణ రెడ్డికి, సుబ్బారెడ్డికి అస్సలు పడదు.
అయితే, ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఆదినారాయణ రెడ్డి టీడీపీ సైకిలెక్కేశాడు. దీనిని వ్యతిరేకించిన సుబ్బారెడ్డిని మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు ఆయన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన ఎమ్మెల్యే కావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదినారయణ రెడ్డి కూడా టీడీపీలో ఉండడంతో 2019లో తిరిగి ఆ టికెట్ను ఆదినారాయణ రెడ్డికే బాబు కేటాయించే ఛాన్స్ ఉంది. దీంతో సుబ్బారెడ్డి తీవ్రంగా మధన పడుతున్నాడట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని తాను భావిస్తున్నానని ఆయన అనుకుంటున్న విషయం జగన్కి తెలిసింది.
దీంతో ఆయన సుబ్బారెడ్డికి ఆహ్వానం పలికాడు. దీనికి సుబ్బారెడ్డి కూడా ఒకే చెప్పాడు. అయితే, ఇప్పటికప్పుడు పార్టీ మారితే.. కేడర్ను పోషించడం కష్టం అవుతుందని జగన్ సలహా ఇవ్వడంతో సుబ్బారెడ్డి తాత్కాలికంగా తన ఫిరాయింపును వాయిదా వేసుకున్నాడట. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బాబుకు ఝలక్ వచ్చి పార్టీ మారొచ్చని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. జగన్ వేసిన ప్లాన్కి బాబు మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.