వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌…షాక్‌లో చంద్ర‌బాబు

విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూకుంభ‌కోణం న్యూస్ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విప‌క్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే గురువారం వైసీపీ అధినేత జ‌గ‌న్ సేవ్ విశాఖ పేరుతో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధ‌ర్నాకు కాస్త బాగానే జ‌నాలు అటెండ్ అయ్యార‌ని సీఎం చంద్ర‌బాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది.

ఈ రిపోర్ట్ చూసిన చంద్ర‌బాబు షాక్ అవ్వ‌డంతో పాటు విశాఖ టీడీపీ నేత‌ల‌పై ప‌ట్ట‌రాని కోపంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. విశాఖలో టీడీపీ నేతలపై తీవ్ర అసంతృప్తి నెలకొందని ఈ నివేదికలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నికల్లో విశాఖ న‌గ‌రంతో పాటు జిల్లా ప్ర‌జ‌లు టీడీపీ, బీజేపీ కూట‌మికి మెజార్టీ సీట్లు క‌ట్ట‌బెట్టారు. న‌గ‌రంలోని నాలుగు సీట్ల‌తో పాటు స‌మీపంలో ఉన్న పెందుర్తి, గాజువాక‌, భీమిలిలో సైతం టీడీపీ జెండా ఎగిరింది.

ఇక విశాఖ ఎంపీ సీటును మిత్ర‌పక్ష‌మైన బీజేపీ గెల‌వ‌గా, అన‌కాప‌ల్లిలో టీడీపీ విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు వీళ్ల‌లో చాలా మంది ఎమ్మెల్యేల‌పై భూకుంభ‌కోణం ఆరోప‌ణ‌లు రావ‌డంతో అక్క‌డ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోన్న‌ట్టు బాబుకు ఇంటిలిజెన్స్ ఇచ్చిన రిపోర్టుల్లో తేలింద‌ట‌. ఇక్క వైసీపీ మ‌హాధ‌ర్నాకు వ‌చ్చిన వాళ్ల‌లో వాళ్ల పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు భూములు కోల్పోయిన బాధితులు సైతం జ‌గ‌న్ త‌మ‌కు అండ‌గా ఉంటాడ‌ని వ‌చ్చిన వాళ్లు ఎక్కువ‌గానే ఉన్నార‌ని కూడా ఇంటిలిజెన్స్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఇక జిల్లాలో మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాస‌రావు, అయ్య‌న్న‌పాత్రుడు మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్‌లో సైతం ప్ర‌భుత్వానికి, పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆ రిపోర్టులో పేర్కొన్న‌ట్టు స‌మాచారం. ఈ రిపోర్టు త‌ర్వాత విశాఖ ప్ర‌జాప్ర‌తినిధులంద‌రితోను మాట్లాడిన చంద్ర‌బాబు భూ కుంభకోణంలో ఎవరిపేర్లున్నా సహించబోనని కూడా ఆయన హెచ్చరించారని తెలుస్తోంది.