జ‌గ‌న్‌కు షాకిచ్చిన వైసీపీ నేత‌లు.. నిజం తెలిస్తే ఆశ్చ‌ర్య‌కరం!!

క‌డ‌ప త‌ర్వాత వైసీపీకి కంచుకోట‌గా మారిన జిల్లా ఏదంటే నెల్లూరు పేరే గుర్తొస్తుంది. కానీ అలాంటి జిల్లాలోనే వైసీపీకి పెద్ద క‌ష్టం వచ్చి ప‌డింది. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించి ఎవ‌రు పోటీ చేస్తార‌నే అంశంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన నాటినుంచి ముఖ్య నేత‌లంగా ముఖం చాటేస్తుండ‌టం అధిష్టానాన్ని తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఒక ప‌క్క అభ్య‌ర్థి ఎవ‌రనే విష‌యం ఇంకా తేల‌నే లేదు.. మ‌రో ప‌క్క నోటిఫికేష‌న్ విడుద‌లై.. నామినేష‌న్లు దాఖలు తేదీకి కూడా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో.. ముందుకా వెనక్కా అనే సందేహంలో స‌త‌మ‌త‌మవుతోంది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థి ఎంపిక విషయంలో వైసీపీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గ‌తేడాది ఈ విష‌యంపై చర్చ సంద‌ర్భంగా.. వైసీపీ పోటీ చేయాలని నేత‌ల‌కు సూచించారు. అభ్య‌ర్థి ఎవ‌ర‌నే అంశంపై చ‌ర్చ జ‌ర‌గ్గా..

బెంగుళూరులో ఓ పారిశ్రామికవేత్త ఉన్నారని రూ. 30 కోట్లు ఖర్చయినా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని జ‌గ‌న్‌ హామీ ఇచ్చారు. తర్వాత ఈ విషయాన్ని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్ర‌క‌టించారు. కానీ నేటి వ‌ర‌కూ అభ్య‌ర్థి మాత్రం క‌నిపించక పోవ‌డం ఆశ్చ‌ర్య‌కరం!!

గురువారం వైవీ సుబ్బారెడ్డి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా బుధవారం సాయంత్రం ఎంపీ మేకపాటితో సమావేశం ఉందని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇనచార్జిలు హాజరు కావాలని ఆహ్వానిస్తే జడ్పీచైర్మన ఒక్కరే హాజరవగా, మిగిలిన ఎవరు అటువైపు తొంగి చూడలేదు. దీనిని బట్టి వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఈ ఎన్నికలంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్ధమవుతోంది. ప్రస్తుతం ఎవరినైనా అభ్యర్థిని తీసుకువచ్చి పోటీలో పెడితే ఆ వ్యక్తి పూర్తి స్థాయి ఖర్చులు భరించలేనని పార్టీ, ఎమ్మెల్యేలు కొంత సహకరించాలని కోరుతున్నారు.

వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ముందుకు వచ్చినా ఆర్ధిక సమస్యతో వారంతా వెనక్కి వెళ్లారు. ప్రస్తుతం ఆనం విజయ కుమార్‌రెడ్డి పేరు పరిశీలిస్తున్నారు. ఆనం కుటుంబంలో ఒకరు పోటీలో ఉన్నట్లుగా ఉంటుంది. ఓడినా జగన్‌ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం ఆనం కుటుంబానికి దక్కుతుందన్నది ఆలోచన. అలాగే నెల్లూరుకు చెందిన రియల్టర్‌ చేవూరు బాలకృష్ణారెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా జిల్లాలో వైసీపీని అన్ని విధాలా నడిపిస్తూ ఈ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాల్సిన జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధనరెడ్డి 15 రోజులుగా అందుబాటులో లేకపోవ‌డం గ‌మ‌నార్హం!