మనం ఏం చేసినా అడిగేదెవరు? జనాలు వెర్రిబాగులోళ్లు! మనం ఏం చెబితే అదే! జనాలు వినితీరతారు అంతే!! అని అనుకునే రాజకీయ నేతలకు గట్టి సమాధానం లాంటి ఉదంతం ఇది! అంతేకాదు, ప్రజలు పిచ్చివాళ్లు కారని, రాజకీయ నేతలను వారు నిశితంగా గమనిస్తుంటారని, నేతలను సమయం వచ్చినప్పుడు కడిగిపారేస్తారని నిరూపించే సంఘటన కూడా ఇది!! విషయంలోకి వెళ్తే.. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆకర్ష్ మంత్రం పఠించారు. దీంతో 20 మంది వరకు జగన్ బ్యాచ్ ఎమ్మెల్యేలు సైకిలెక్కేశారు. అయితే, వీరంతా జనాలు ఏమనుకుంటారని కానీ, మనం వైసీపీ కండువా కప్పుకొని అప్పట్లో గెలిచాం. ఇప్పుడు టీడీపీ పంచన చేరుతున్నాం.. జనాలకు ఏం సమాధానం చెప్పాలి అనికానీ ఆలోచించలేదు. దీంతో ఇప్పుడు వాళ్లకు దిమ్మతిరుగుతోంది.
ఇలా ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి కూడా ఒకరు. 2014లో ఈయన జగన్ అండతో ఇక్కడ విజయం సాధించారు. తర్వాత బాబు పిలుపుతో పార్టీ మారిపోయారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇటీవల బాబు పిలుపుతో.. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు. ఈ క్రమంలో అశోక్ రెడ్డి కూడా పచ్చకండువా వేసుకుని… టీడీపీ తరపున ఇంటింటికీ వెళ్లి జనాలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అనూహ్య పరిణామం ఎదురైంది.
‘అప్పుడు వైకాపాకు ఓటు వేయమని అడగడానికి వచ్చారు.. ఇప్పుడు టీడీపీ అంటూ వచ్చారేంటి?’ అని పలువురు ఆయనను బహిరంగంగానే ప్రశ్నించడం గమనార్హం. ఈ ఫిరాయింపు ఏందుకు అని కూడా అడిగారు. దీంతో ఆయన.. మీ కోసమే పార్టీ మారాను. నియోజకవర్గానికి బాబు నిధులు ఇస్తానంటే .. కండువా మార్చాను అని సమాధానం ఇచ్చి సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. అయినా కూడా జనాలు ఆగలేదు. అయితే, మీరు కండువా మార్చి.. సైకిలెక్కి కూడా ఏడాది అయిపోయిందికదా.. మరి ఇప్పటికీ అభివృద్ధి పనులు మొదలవలేదు కదా? అని ఎదురు ప్రశ్నించారట. దీంతో అశోక్ రెడ్డికి కుండ పోత వర్షంలోనూగొంతెండి పోయి.. గ్లాసు నీళ్లు తాగేశాడట. ఇదీ వైసీపీ ఫిరాయింపుదారులకు ఎదురవుతున్న ప్రశ్న. మరి రాబోయే రోజుల్లో ఈ పరిణామం రాష్ట్రం వ్యాప్తంగా ఎదురైతే.. వీళ్ల సంగతేమో కానీ, బాబు పరిస్థితి ఢమాలే అంటున్నారు విశ్లేషకులు.