బాహుబలి రేంజ్‌లో ‘ జై ల‌వకుశ‌ ‘ …. ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సునామి మొదలైంది. మూడు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించేందుకు ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ చిత్రంతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 90 శాతంకు పైన‌ థియేట్ల‌లో రిలీజ‌వుతోంద‌ని స‌మాచారం. ఇక నైజాంలోనూ రికార్డ్ స్థాయిలో రిలీజ్ అవుతూ స‌రికొత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకోనుంది.

ఎన్టీఆర్ చివ‌రి సినిమా జ‌న‌తా గ్యారేజ్ నైజాంలో 331 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా మాత్రం ఏకంగా 356 థియేట‌ర్ల‌లో వ‌స్తోంది. బాహుబ‌లి 1,2 చిత్రాలు నైజాంలో 400 పైగా థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యాయి. బాహుబ‌లి సీరిస్ చిత్రాలు ఓపెనింగ్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డంతో భారీ రిలీజ్ దోహ‌ద‌ప‌డింది. ఇక ఇప్పుడు బాహుబ‌లికి కాస్త అటూ ఇటూగానే జై ల‌వ‌కుశ కూడా రిలీజ్ అవుతోంది.

ఇక జై ల‌వ‌కుశ‌ ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 100 స్క్రీన్‌లలో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు బాహుబ‌లి మాత్ర‌మే హైద‌రాబాద్‌లో ఈ రేంజ్‌లో రిలీజ్ అయ్యింది. బాహుబ‌లి త‌ర్వాత ఈ అరుదైన రికార్డు ఎన్టీఆర్ ఖాతాలోనే ప‌డింది. నైజాం ఏరియాలో ఎన్టీఆర్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఆ క్రేజ్‌ను వినియోగించుకుని వారం రోజుల్లోనే కలెక్షన్స్‌ను రాబట్టే విధంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ద‌స‌రా సెల‌వులు కూడా వ‌స్తుండ‌డంతో జై ల‌వ‌కుశ‌కు టాక్ బాగుంటే బాక్సాఫీస్ వ‌ద్ద దున్నుడు మామూలుగా ఉండ‌దు.

జ‌న‌తా గ్యారేజ్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా 86 కోట్ల మేర షేర్ వ‌సూలు చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ తెలుగు వెర్ష‌న్ ఆ స్థాయిని అందుకుంది. ఇక‌ `జై ల‌వ‌కుశ` ప్రీరిలీజ్ బిజినెస్ 112 కోట్ల(మ‌ల‌యాళ వెర్ష‌న్ మిన‌హాయించి) మేర సాగింది. అంటే అంత‌కుమించి వ‌సూళ్లు సాధించాల్సి ఉంటుంది కాబ‌ట్టి ..అంచ‌నాలు పీక్స్‌లోనే ఉన్నాయి.