ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ పటిష్టత కోసం వేసిన ఓ ప్లాన్ రివర్స్ గేర్లో తిరిగి బాబుకే పెద్ద దెబ్బ వేసింది. తన ప్లాన్ తనకే రివర్స్లో తిరిగి రావడంతో చంద్రబాబు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నాడు. ఏపీలో గత యేడాది కాలంగా చంద్రబాబు విపక్ష వైసీపీ నుంచి తన పార్టీలోకి భారీ ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఈ ఫిరాయింపుల ఎఫెక్ట్తో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సైతం వచ్చాయి.
ఫిరాయింపుల ఎఫెక్ట్తో పార్టీ బాగా బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ చాలా వీక్ అవుతుందని చంద్రబాబు లెక్కలు వేశారు. చంద్రబాబు లెక్కల సంగతేమోగాని ఇప్పుడు ఆయనకు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో లేనిపోని చిక్కులు వచ్చి పడుతున్నాయి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నప్పుడు అప్పటి వరకు ఉన్న ఇన్చార్జ్లకు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి… మీకు వచ్చిన ఇబ్బందేమి లేదని సర్దిచెప్పారు.
తీరా చూస్తే ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగడం డౌట్గానే ఉంది. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు వర్సెస్ నియోజకవర్గాల ఇన్చార్జ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్లో ఫైటింగ్ జరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం.
రవి, బలరాం మధ్య జరిగిన వార్లో చివరకు ఇద్దరూ చొక్కాలు చించుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఇంత సీన్ జరుగుతున్నా అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు ప్రేక్షక పాత్ర వహించారు అద్దంకిలో మాత్రమే కాదు ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల వేల ఫిరాయింపు ఎమ్మెల్యేలు వర్సెస్ పాత నాయకుల మధ్య జగడం మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.