ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు మరో నెల రోజుల్లోగానే నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిగా ఇక్కడ మృతిచెందిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థి ఎంపిక జగన్కు కాస్త చిక్కుగానే ఉంది. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ రాజ్గోపాల్రెడ్డితో పాటు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి, ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి పోటీపడుతున్నారు.
ఇక్కడ ప్రధాన పార్టీల సంగతి ఇలా ఉంటే 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతోన్న పవన్కళ్యాణ్ జనసేన నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? ఈ ఎన్నికల్లో జనసేన స్టాండ్ ఏంటనే దానిపై ఏపీ రాజకీయవర్గాల్లో అప్పుడే చర్చలు జరుగుతున్నాయి. పవన్ ఎలాగూ త్రివిక్రమ్ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నీశన్ డైరెక్ట్ చేసే సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక వచ్చే ఎన్నికలకు మరో 20 నెలల టైం మాత్రమే ఉంది. అయినా పవన్ ఇప్పుడు పాలిటిక్స్ను పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు కనపడడం లేదు.
ఈ క్రమంలోనే నంద్యాల ఉప ఎన్నికల్లో జనసేన పోటీ చేసినా గెలుపు కాదు కదా…కనీసం డిపాజిట్లు అయినా వస్తాయా ? అన్నది సందేహమే. ఈ లెక్కలు ఎలా ఉన్నా పవన్ నంద్యాల ఉప ఎన్నికల్లో ముందే కాడీ కింద పడేసినట్టే కనపిస్తోంది. ఇక్కడ పోటీ చేసినా ఉపయోగం లేదని డిసైడ్ అయిన పవన్ ఇక్కడ టీడీపీకి ఇన్ డైరెక్టుగా సపోర్ట్ ఇవ్వాలని ప్రాథమికంగా డిసైడ్ అయినట్టు కనపడుతోంది.
నంద్యాలలో పోటీ చేస్తే జనసేన ఎలాగూ ఓడిపోతుంది. అదే టీడీపీకి సపోర్ట్ చేస్తే పవన్ సంప్రదాయాన్ని పాటించి భూమా ఫ్యామిలీకి మద్దతు ఇచ్చాడని బోల్డెంత క్రెడిట్ దక్కించుకోవచ్చు. ఇప్పుడు పవన్ ఇక్కడ ఈ ప్లాన్నే అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు జనసేన వర్గాల నుంచే మ్యాటర్ లీక్ అయ్యింది. నంద్యాలలో భూమా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలాగూ ఉంది. ఈ క్రమంలోనే టీడీపీకి డైరెక్టుగా సపోర్ట్ చేయకపోయినా పోటీ చేయకుండా ఇన్డైరెక్టుగా సపోర్ట్ చేయవచ్చని సమాచారం.