బాహుబ‌లి-2లో ఆ సీన్‌కి ప‌వ‌న్ అభిమానుల స్ఫూర్తి

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి చెక్కిన అద్భుత దృశ్య‌ కావ్యం బాహుబ‌లి-2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. రికార్డుల‌న్నీ తిర‌గ‌రాస్తోంది. అద్భుత‌మైన టేకింగ్‌తో పాటు.. ప్రేక్ష‌కుడిలోని భావోద్వేగాల‌ను ఒక రేంజ్‌కి తీసుకెళ్లే స‌న్నివేశాలు సాహోరే అనిపించ‌క మాన‌వు. అలాంటి స‌న్నివేశాల్లో ఇంట‌ర్వెల్ సీన్ కూడా ఒక‌టి. `అమ‌రేంద్ర బాహుబ‌లి అను నేను ` అని అన‌గానే రోమాలు నిక్క‌బొడుచుకునేలా ఈ సీన్‌ని తీయ‌డంలో రాజ‌మౌళి భ‌ళా అనిపించుకున్నాడు. మ‌రి ఈ సీన్‌కి ఇన్స్‌పిరేష‌న్ ఎవ‌రో తెలుసా? ఇంకెవ‌రు జ‌న‌సేనాని, పవ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అట‌! ఏంటి న‌మ్మ‌శ‌క్యంగా లేదా? ఇది స్వ‌యంగా రాజ‌మౌళి తండ్రి, బాహుబ‌లి ర‌చ‌యిత విజ‌యేంద్ర‌ప్రసాద్ చెప్పిన విష‌యం!!

త‌న‌కు తెలియ‌కుండానే ప‌వ‌న్ క‌ల్యాణ్ భారీ చిత్రంలో భాగ‌మైపోయాడు! విష‌యం ఏంటంటే ఈమ‌ధ్య ఆడియో పంక్ష‌న్ల‌లో ప‌వ‌న్ పేరెత్తితే చాలు.. అభిమానులు రెచ్చిపోతున్నారు. ఆ స‌భ‌లో ప‌వ‌న్ ఉన్నా, లేకున్నా.. ప‌వ‌ర్ స్టార్ – ప‌వ‌ర్ స్టార్ అంటూ గోల గోల చేస్తున్నారు. ఆడిటోరియం మొత్తం ద‌ద్ద‌రిల్లేలా అరుస్తున్నారు. దీంతో ఎవ్వ‌రూ కాసేపటివ‌ర‌కూ మాట్లాడటానికి అవ‌కాశమే ఉండ‌టం లేదు. వేదిక‌పై ఓ హీరో ఉన్న‌ప్పుడు, వేరే హీరో గురించి అభిమానులు కేక‌లు వేస్తే ఎవ్వ‌రికైనా జెల‌సీ వ‌స్తుంది. ఇదే కాన్సెప్ట్‌ని బాహుబ‌లి-2 ఇంట‌ర్వెల్ సీన్‌లోనూ అప్లై చేశారు.

బాహుబ‌లి 2లో ఇంట్ర‌వెల్ సీన్ గుర్తుంది క‌దా? భ‌ళ్లాల‌దేవ‌కు ప‌ట్టాభిషేకం జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో బాహుబ‌లి సైన్యాధిప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాడు. భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం పై కూర్చున్న‌ప్పుడు చ‌ప్పుడు చేయ‌ని మాహీష్మ‌తీ ప్ర‌జ‌లు… సైన్యాధ్య‌క్షుడిగా బాహుబ‌లి ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ప్పుడు మాత్రం ఆవేశంగా రెచ్చిపోతారు. ఆ చ‌ప్పుళ్ల‌కు భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం సైతం క‌దిలిపోతుంది. భూమి ద‌ద్ద‌రిల్లుతుంది. దాంతో… రాజునయ్యా అన్న సంతృప్తి, సంతోష‌కం కూడా భ‌ళ్లాల‌దేవ క‌ళ్ల‌లో మాయం అవుతుంది. ఈ స‌న్నివేశానికి స్ఫూర్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులేన‌ట‌. ఈ విష‌యాన్ని ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాదే స్వ‌యంగా అంగీక‌రించారు.

సినిమా ఇంట‌ర్వెల్ గురించి ఆలోచిస్తున్న స‌మ‌యంలో భ‌ళ్లాల‌దేవ పాత్ర‌లోనూ ఆ జెల‌సీ చూడాల్సిన సంద‌ర్భం బాహుబ‌లి 2 క‌థ‌లో వ‌చ్చింది. ఆ సీన్ రాస్తున్న‌ప్పుడు టీవీలో ఓ ఆడియో ఫంక్ష‌న్ వ‌స్తోంద‌ట‌. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానులు గోల గోల చేయ‌డం, వేదిక పై ఉన్న హీరోలు చిన్న‌బుచ్చుకోవ‌డం విజ‌యేంద్ర ప్ర‌సాద్ గ‌మ‌నించాడ‌ట‌. త‌న క‌థకి, రాయ‌బోతున్న స‌న్నివేశానికీ ఆ సంద‌ర్భం న‌ప్ప‌డంతో… బాహుబ‌లి ఇంట్ర‌వెల్ సీన్ ఆ స్ఫూర్తితో డిజైన్ చేసుకొన్నార్ట‌. బాహుబ‌లి 2 విజ‌యంలో ఇంట్ర‌వెల్ సీన్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించింది.