జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీగా ప‌వ‌న్ ర‌థ‌యాత్ర‌

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన‌ ప‌వ‌న్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్ పార్టీ ఇంకా క్షేత్ర‌స్థాయిలోనే బ‌లోపేతం కాలేద‌ని, మ‌రి ఈ టైంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ఎలా వెళ‌తాడు ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఇక పవ‌న్ ఎట్ట‌కేల‌కు పార్ట్ టైం పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు రాకుండా ఫుల్ టైం పొలిటిషీయ‌న్‌గా మారేందుకు రెడీ అవుతున్నాడు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు ప‌వ‌న్ మెద‌లెట్టేశాడ‌ట‌. ప‌వ‌న్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌గా కంప్లీట్ చేసి త‌న పుట్టిన రోజు అయిన సెప్టెంబ‌ర్ 2 నుంచి ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు ఓ కార్య‌క్ర‌మం ప్రారంభిస్తున్న‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

సెప్టెంబర్ 2న అనంతపురం నుంచి ప‌వ‌న్ రథయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ ఇప్ప‌టికే తాను ఏపీలోని అనంత‌పురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ అదే జిల్లా నుంచి ఇప్పుడు ర‌థ‌యాత్ర‌కు రెడీ అవుతున్నట్టు స‌మాచారం. ఓ వైపు సినిమాలు ఇటు రాజ‌కీయాలు రెండు ప‌డ‌వల మీద న‌డుస్తోన్న ప‌వ‌న్ ముందుగా పాద‌యాత్ర చేయాల‌ని భావించారు.

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీగా ప‌వ‌న్ పాద‌యాత్ర కూడా ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా ప‌ర్య‌టించాల్సిన అవ‌స‌రం ఉండ‌డంతో ప‌వ‌న్ ర‌థ‌యాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర అక్టోబర్ 27 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని జనసేన పార్టీ ప్రారంభించినట్లవుతుంది.

ఇక ఏపీలో తాను చేసే ర‌థ‌యాత్ర‌లో ప్ర‌త్యేక హోదా అంశాన్ని హైలెట్ చేస్తాడ‌ని టాక్‌. మ‌రి తెలంగాణ‌లో ఏ అంశాన్ని ప‌వ‌న్ ఎత్తుకుంటాడ‌న్న‌దే ఇప్పుడు కాస్త స‌స్పెన్స్‌గా మారింది.