టీడీపీలోకి మాజీ మంత్రి… బాబు మంచి ఆఫ‌ర్‌

సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌, కాంగ్రెస్ మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రా రెడ్డి  సైకిలెక్క‌డం ఖాయ‌మైపోయింది. క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన డీఎల్ స్థానికంగా బ‌ల‌మైన నేత‌. కాంగ్రెస్‌లో ఉండ‌గా తిరుగులేని నేత‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే, విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ రూపు రేఖ‌లు మారిపోయి.. అడ్ర‌స్ గ‌ల్లంత‌వ‌డంతో ఆయ‌న పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో పార్టీ మారి ఎమ్మెల్యే సీటు సంపాయించాల‌ని ప్లాన్ వేశారు. ఈ క్ర‌మంలోనే తొలుత ఆయ‌న వైసీపీ వైపు మొగ్గారు. 

అయితే, నంద్యాల స‌హా కాకినాడ‌ కార్పొరేష‌న్‌లో వైసీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆయ‌న బాబే బెస్ట్ అనుకుని టీడీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక‌,  టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం క‌డ‌ప‌లో పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు జ‌గ‌న్‌ను సొంత నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ట్టి క‌రిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే క‌డప నుంచి ఎంత‌మంది వ‌చ్చినా పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. దీంతో డీఎల్‌ను ఆయ‌న ఆత్మీయంగా ఆహ్వానించ‌డంతోపాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మైదుకూరు సీటును కూడా డీఎల్‌కు కేటాయించేశార‌ని తెలుస్తోంది.

మొత్తంగా టీడీపీలోకి డీఎల్ రాక ఖ‌రారైపోయిన త‌ర్వాత మైదుకూరులో టీడీపీకి సీనియ‌ర్‌గా ఉన్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు టీటీడీ చైర్మ‌న్ గిరీని అప్ప‌గించారు. దీనికి ఎంతో పోటీ ఉన్నా..డీఎల్‌ను దృష్టిలో పెట్టుకునే బాబు ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే,  మైదుకూరులో మరో సీనియర్‌ నేత, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి అనుచరులు అసంతృప్తిలో వున్నారు. 

ఎంతోకాలంగా పార్టీని నమ్ముకొని పనిచేసినా ఇంతవరకు ఆయనకు ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి వారిలో వుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు నామినేటెడ్‌ పదవి ఇచ్చి ప్రాధాన్యం కల్పిస్తారని ఆయనతో పాటు ఆయన వర్గీయులు ఆశప‌డ్డారు. దీంతో రాబోయే రోజుల్లో ఈయ‌న వైసీపీలో చేరినా ఆశ్చ‌ర్య పోన‌క్క‌ర‌లేద‌ని అంటున్నారు విశ్లేష‌కులు మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.