పీకే జ‌వాబుతో అంద‌రూ ఫూల్స్

`వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లు ఇందులో తేలింది. టీడీపీకి మ‌రోసారి విజ‌యం గ్యారెంటీ` అని టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో కొంత‌మంది అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించేశారు. ప్ర‌స్తుతం వీరి అత్యుత్సాహం నీరుగారిపోయింది. ఇప్పుడు వీళ్లంతా ఫూల్స్ అయిపోయారు. వైఎస్ఆర్ సీపీని, నేత‌ల‌ను ఇరుకున పెట్టి సోష‌ల్ మీడియాలో వీలైనంత వ‌ర‌కూ ల‌బ్ధి పొందాల‌ని చూసిన వీరంతా.. `ఇదంతా బోగ‌స్` అని ప్ర‌శాంత్ తేల్చేయ‌డంతో అభాసుపాల‌య్యారు. దీంతో వైసీపీ నేత‌ల్లో ఉన్న అనుమానాలు తొల‌గిపోయాయి.

పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసేందుకు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లిచ్చేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అనుభ‌వ‌జ్ఞుడైన ప్ర‌శాంత్ కిషోర్‌ను ఎన్నుకున్నారు. వీరిని పార్టీ నేత‌ల‌కు ప‌రిచ‌యం చేశారు జ‌గ‌న్‌! అయితే ఇప్ప‌టివ‌రకూ వైసీపీ జిల్లా ప‌రిశీల‌కులు, అధ్య‌కుల్లో కొన్నిసందేహాలు నిలిచిపోయాయి. వీటిపై ప్ర‌శాంత్ క్లారిటి ఇచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాల్లో పెట్టబోతున్న తీర్మానాలపై చర్చించడం కోసం ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రశాంత్‌ కిషోర్‌ను జగన్‌ ఆహ్వానించారు. పార్టీని శాస్త్రీయంగా విశ్లేషించి పటిష్టతకు ఆయ‌న సేవలు తీసుకుంటున్నామని జగన్‌ వెల్లడించారు.

`రాష్ట్రంలో ఇప్పటికే మీ బృందం సర్వేలు జరిగినట్లుగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితులున్నట్లుగా టీడీపీ అనుకూల మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం జరుగుతోంది కదా?’ అని ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రస్తావించారు. `అవును… ఇలాంటి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి. అదంతా బోగస్, మేం ఎలాంటి సర్వే చేయలేదు. మేమింకా పని మొదలు పెట్టనేలేదు. మా బృందంతో ఇపుడిపుడే కార్యక్షేత్రంలోకి దిగు తున్నాం. అయినా ప్రాథమికంగా మా ప్రవృత్తి సర్వేలు చేయడం కానే కాదు. అవసరమని భావించినపుడు సర్వేలు చేస్తాం తప్ప అదే ప్రధానం కాదు` అని ఆయన సమాధానమిచ్చారు.

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని., అవన్నీ బోగస్ గా తేల్చారు. పార్టీ పరిస్థితి., పని తీరు క్షేత్ర స్థాయిలో ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని., రాష్ట్ర స్థాయిలో నేతలతో సమన్వయం చేసేందుకు ఒక బృందం., జిల్లాల్లో మరికొన్ని బృందాలు ఉంటాయన్నారు. తమ టీం జిల్లా అధ్యక్షులు., ముఖ్య నేతలతో టచ్ లో ఉంటారని., ఏమైనా లోపాలు ఉంటే నేతల దృష్టికి తెస్తారని వివరించడంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.గ‌త కొంత‌కాలంగా.. వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించిన నాటి నుంచి టీడీపీ అనుకూల సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే!!