ఎట్టి పరిస్థితిలోనూ 2019లో ఏపీలో అధికారం కైవసం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్న వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో తనకు ఎలక్షన్ సలహాదారుగా ఉత్తరాది నుంచి కోట్లు ఖర్చు పెట్టి మరీ ప్రశాంత్ కిశోర్ను దిగుమతి చేసుకున్నాడు. వచ్చీ రావడంతోనే ప్రశాంత్ కిశోర్ రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సినారియో మీద ఓ సర్వే చేయించాడు. ప్రభుత్వం, ప్రతిపక్షం బలాబలాలు, జనసేనాని దూకుడు.. కాంగ్రెస్ వామపక్షాల గాలి వంటి వివిధ అంశాలపై ఆయన తన దైన స్టైల్లో సర్వే చేయించాడు.
ఈ రిజల్ట్ కూడా వచ్చిందని సమాచారం. అయితే, ప్రశాంత్ కిశోర్ దీనిని ఎక్కడా బహిరంగ పరచలేదు. అలాగని వైసీపీ నేతలు కూడా ఎక్కడా ఈ సర్వే తాలూకు రిజల్ట్ని మాట వరుసకు కూడా బయట పెట్టలేదు. అయినప్పటికీ.. ఇప్పుడు ఈ సర్వే ఫలితాలపై సోషల్ మీడియాలో వింత ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రశాంత్ కిశోర్ చేయించిన సర్వేలో అధికార పక్షం టీడీపీకే జనాలు జై కొడుతున్నారని తేలిందని ఈ ప్రచారం తాలుకూ ప్రధాన సారాంశం.
రాబోయే 2019 ఎన్నికల్లో టీడీపీ 41 శాతం ఓట్లతో 114 + సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 27 శాతం ఓట్లతో 49 సీట్లు గెలుచుకుంటుందని ఈ సర్వేలో తేలింది. ఇక జనసేన 13 శాతం ఓట్లతో 10 + సీట్లు, కాంగ్రెస్ 7 శాతం సీట్లతో 2 సీట్లు గెలుచుకుంటుందని సర్వే స్పష్టం చేసింది. ఈ సర్వే చూసిన జగన్కు నోట మాట రాక, పీకేపై అసంతృప్తి వ్యక్తం చేశారని కూడా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోతోంది. అంటే.. ఎవరు ఎలాంటి సర్వే చేయించినా.. అధికార టీడీపీనే బలంగా ఉందని చాటి చెప్పడం దీని ఉద్దేశం.
అయితే, ఇప్పుడు ఈ సోషల్ ప్రచారంపైనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాబు మూడేళ్ల పాలనపై ఉభయ గోదావరి జిల్లాలు సహా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. కాపులైతే లోలోనే రగిలిపోతున్నారు. ఇక, నిరుద్యోగులు కూడా బాబుపై మండిపడుతున్నారు. రైతులు నకిలీలను అరికట్టే వాడు లేక నానా తిప్పులు పడుతున్నారు. పోనీ రుణమాఫీ అయినా సక్రమంగా జరిగిందా ? అంటే అదీ లేదు. సీమ ప్రాంతాల్లోనూ సీఎం నీటిని ఊరిస్తున్నారే కానీ .. పూర్తిగా విడుదల చేసింది లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక, సొంత పార్టీలో తమ్ముళ్లు, మంత్రులు ఎప్పుడు రోడ్డున పడి తన్నుకుంటారో చెప్పలేని పరిస్థితి.
పరిస్థితి ఇలా ఉంటే.. ప్రజలు బాబుకే జై కొడుతున్నారని సర్వేలో తేలడం ఎంత వరకు నిజం. అది కూడా జగన్ కోట్లు ఖర్చు పెట్టి నియమించిన వ్యక్తి.. జగన్కి అనుకూలంగా కాకుండా బాబుకు సానుకూలంగా సర్వే రిజల్ట్ ఇవ్వడం ఎంత వరకు నిజం. అదీ కాక, ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిజల్ట్ను జగన్ అండ్ కోలు ఎక్కడా బయట పెట్టకుండానే ఇలా బయటకు పొక్కడం.. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం వెనుక తెలుగు తమ్ముళ్ల హస్తం ఉందనేది వాస్తవం. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.