ఎప్పుడెప్పుడా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న ఏపీలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ పట్టాలమీదకి ఎక్కింది. రాబోయే రెండు మూడు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రానుంది. 2019లో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వెయ్యి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న జగన్.. మోడీకి ఎన్నికల ప్లాన్ ఇచ్చి.. అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్ను ఈ దఫా తనకు సలహాదారుగా నియమించుకున్నారు.
ఈ నెల 1 న తన విధుల్లో చేరిపోయిన ప్రశాంత్ కిషోర్.. అప్పుడే ఏపీ ప్రజలకు జగన్ను మరింత చేరువ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఫస్ట్ ఆయన ఏపీలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఎక్కడుందని ప్రశ్నించారు. దీనికి ఇంకా ఏర్పాటు కాలేదన్న సమాధానంతో ఆశ్చర్యపోయిన పీకే.. తక్షణమే జగన్.. ఏపీకి చేరుకోవాల్సిన ఉండాల్సిన అవసరంపై పెద్ద ఎత్తున క్లాస్ పీకాడట. అధికార టీడీపీయే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేసిన రెండు ఏళ్లు అవుతుంటే.. విపక్షం ఇంకా హైదరాబాద్లోనే ఉండడం ఏమిటని ప్రశ్నించిన ఆయన.. తక్షణమే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవాలని, అక్కడే కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారట.
దీంతో వైసీపీ నేతలు ఆఘమేఘాల మీద విజయవాడలో వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారట. ఈ క్రమంలోనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో అద్దె భవనం కోసం వేట సాగిస్తున్నట్టు సమాచారం. ఓ రెండు భవనాలను గుర్తించారనీ, విదేశీ పర్యటనలో ఉన్న జగన్ తిరిగి రాగానే ఏదో ఒకటి ఫైనలైజ్ చేసి.. ఏపీ కార్యాలయాన్ని వెంటనే ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు జగన్ ఇంటి కోసం కూడా మరో భవనాన్ని చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ప్రశాంత్ రావడంతో వైసీపీ ప్రధాన కార్యాలయం విజయవాడకు తరలించడం దాదాపు డిసైడ్ అయినట్టే.