క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో.. కొంతమంది నేతలు ఇప్పుడు నేతలు లైన్ దాటుతున్నారు. అసంతృప్తి అంతగా వినిపించని పార్టీలో.. నిరసన గళం చాలా చోట్ల వినిపిస్తోంది. ఆశించిన పదవి దక్కనప్పుడు అలకలు సహజమే అయినా.. నేతలంతా బోర్డర్ క్రాస్ చేసేస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి సొంత పార్టీ పెట్టుకుంటామని ప్రకటించేస్తున్నారు. మొన్నటికి మొన్న మంత్రి పదవి దక్కలేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాంటి ప్రకటనే చేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు.
తెలంగాణలో టీడీపీ హవా కొద్దికొద్దిగా తగ్గుతోంది. ఇప్పటికే నాయకులంతా చెరో దారి వెతుకున్నారు. పార్టీకి కాస్తో కూస్తో పేరు నిలబడుతోందంటే అది.. రేవంత్ రెడ్డి వల్లే! పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఏపీకే పరిమితమవ్వడం.. తెలంగాణ రాజకీయాలపై దృష్టిసారించలేకపోతుండటం ఇప్పుడు టీడీపీ నేతలను మరింత కలవరపెడుతోంది. దీంతో ఉన్న వారు కూడా తమ సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారు.. అందుకు తగ్గట్టు ప్రణాళికలు వేసుకుంటున్నా రు. టీటీడీపీ సీఎం అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన టీడీపీ అధినేత తర్వాత ఆయన్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇంత కాలం వేచి చూసిన ఆయన.. ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకునే ఆలోచనలో ఉన్నారట.
తిరుపతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం పొలిట్ బ్యూరో సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న బీసీల డిమాండ్లను రాజకీయ పార్టీలు పట్టించు కోవడం లేదన్నారు. అందుకే బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక పార్టీ ఏర్పాటు చేయాలనే అంశాన్ని పరిశీలిస్తు న్నామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 58 శాతం ఉన్న బీసీల రాజ్యాంగపరమైన రాజ్యాధికారం కోసం ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నామ న్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీల సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంచేస్తూ బీసీలను తమ తమ రాజకీయ అవసరాలకు వినియోగించుకుంటున్నాయని మండిపడ్డారు.
జాతీయ సాయిలో 56 శాతం రాజకీయ పరమైన రిజర్వేషన్లు కల్పిం చడానికి రాజ్యాంగపరమైన సవరణలు చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. తమకు నియోజకవర్గాల వారీగా జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపులు చేయని పార్టీలను బీసీల వ్యతిరేక పార్టీలుగా ప్రకటిస్తామన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా రాజకీయపార్టీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చిందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చిస్తామని అందరి అభిప్రాయాల ఆధారంగా త్వరలో తగు నిర్ణయం తీసుకుంటామని కృష్ణయ్య స్పష్టంచేశారు. మరి కృష్ణయ్య ఆలోచన ఎంతవరకూ ఆచరణ సాధ్యమవుతుందో వేచిచూడాల్సిందే!!