నంద్యాల- ఈ పేరు చెబితేనే చాలు రాష్ట్రంలోని ఓ మీడియా వర్గానికి ఎక్కడాలేని ఉలుకొచ్చేస్తోందట! అక్కడి వార్తలను కవర్ చేయడం, ప్రసారం చేయడంలోనూ ఇలానే దుందుడుకు దూకుడుగా వ్యవహరిస్తోందట. ముఖ్యంగా ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రారంభానికి ముందే ఈ మీడియా.. చాలా దుందుడుకు కథనాలు ప్లే చేస్తోందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ భూమా నాగిరెడ్డి మరణంతో ఎన్నికలు రావడం, వైసీపీ కూడా బరిలో నిలబడడంతో టీడీపీని సమర్ధించే ఏబీఎన్ చానెల్కు ఒక్కసారిగా టెన్షన్తో కూడిన ఆందోళన పెరిగిపోయిందట! దీంతో ఎ న్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి విపరీతమైన కథనాలు, బ్రేకింగ్ న్యూస్లతో జనాల్ని బెదరకొడుతోందనే టాక్ వినిపిస్తోంది.
ఈ చానెల్ ఎండీ రాధాకృష్ణకు నంద్యాల విషయంలో ఎందుకంత ఉత్సాహం అని చర్చించుకునే రేంజ్కి విషయం వెళ్లిందంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఇక, ఇప్పుడు తాజాగా బుధవారం జరిగిన ఉప ఎన్నికల ప్రసారంలోనూ అతి చేసి.. కర్నూలు కలెక్టర్తో చీవాట్లు తిన్నది ఈ చానెల్. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి(పీవో) అస్వస్థతకు గురైతే.. ఏకంగా మరణించారంటూ ఏబీఎన్ చానల్లో బ్రేకింగ్ న్యూస్ కింద ప్రసారం చేశారు. దాదాపు పది నిమిషాల పాటు ఈ బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్తితి వచ్చింది.
కలెక్టరేలట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ.. ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే వివరాలు ఆరా తీశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాసరెడ్డి కోలుకున్నారన్న సమాచారం రావడంతో కలెక్టర్ వెంటనే ఏబీఎన్ చానల్ కార్యాలయానికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మీకు కొంచమైనా జ్ఞానముందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పీవో మరణించారని ఎలా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు? ఈ వార్త చూస్తే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏం కావాలి? వార్త ఇచ్చేటప్పుడు వాస్తవాలు ధ్రువీకరించుకోవాలనే విషయం తెలియదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో కోలుకున్నట్లు వెంటనే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని ఏబీఎన్ చానల్ను ఆయన ఆదేశించారు. దీంతో దమ్మున్న చానెల్ కాస్తా.. ఖంగుతిని తోకముడిచింది. ఇంత అత్యత్సాహం ఎందుకమ్మా అనే కామెంట్లను అనిపించుకుంది.