అమ‌రావ‌తిపై అబ‌ద్ధ‌పు ప్ర‌చారానికి రాజ‌మౌళి చెక్‌

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళిని ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌న్స‌ల్టెంట్‌గా, డిజైన‌ర్‌గా నియ‌మించారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా రాజ‌మౌళి చంద్ర‌బాబును క‌ల‌వ‌డంతో ఈ వార్త‌లు జోరందుకున్నాయి. రాజ‌మౌళి చంద్ర‌బాబుతో పాటు లండ‌న్ వెళ‌తార‌ని, రాజ‌మౌళికి చంద్ర‌బాబు ఇందుకోసం భారీ డీల్ ఇచ్చార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

అమ‌రావ‌తిని రాజ‌మౌళికి ఇచ్చేసిన చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టును మ‌రో టాప్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌కు అప్ప‌గిస్తారంటూ సెటైర్లు కూడా ప‌డ్డాయి. త‌న‌పై వ‌స్తోన్న వార్త‌ల‌కు రాజ‌మౌళి ఈ రోజు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆన్స‌ర్లు ఇచ్చారు. అమ‌రావ‌తి నిర్మాణానికి తనను కన్సల్టెంట్‌గా, డిజైనర్‌గా, సూపర్‌వైజర్‌గా నియమించారంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

అమ‌రావ‌తి నిర్మాణానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది అని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణానికి వాళ్లు స‌మ‌ర్పించిన డిజైన్లు సూప‌ర్బ్‌గా ఉన్నాయ‌ని చెప్పిన రాజ‌మౌళి, ఈ డిజైన్లు చంద్ర‌బాబుకు కూడా ఎంతో న‌చ్చాయ‌ని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ మరింత ప్రత్యేకంగా ఉండాలని సీఎం భావిస్తున్నార‌ని, ఆయ‌న మ‌దిలో ఉన్న ఆలోచ‌న‌ల‌ను, విజన్‌ను నార్మన్ ఫోస్టర్ ప్రతినిధలకు వివరించడమే తన పని అని క్లారిటీ ఇచ్చారు.

ఇక అమ‌రావ‌తి రాజధాని నిర్మాణం అనేది ఓ చారిత్రాత్మ‌క ప్రాజెక్టు అని, ఇందులో త‌న‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించడాన్ని చిన్న అవ‌కాశంగానే తాను భావిస్తాన‌ని చెప్పారు. దీంతో రాజ‌మౌళిని టార్గెట్ చేస్తూ వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న చెక్ పెట్టిన‌ట్ల‌య్యింది.

rajamouli twitter