సూపర్స్టార్ రజనీకాంత్ – ఏ వన్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన రోబో సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. 2010లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా రజనీ – శంకర్ ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సినిమా తర్వాత అటు రజనీ, ఇటు శంకర్ ప్లాప్లు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా వస్తోన్న 2.0 సినిమా కోసం ఇండియన్ సినీ జనాలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 25 జనవరి, 2017న రిలీజ్ కానుంది. ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో ? ఇప్పటి వరకు ఎవ్వరికి చిన్న లైన్ కూడా తెలియదు. అయితే 2.0 స్టోరీ ఇదేనంటూ చెన్నై కోడంబాక్కమ్ సర్కిల్స్లో ఓ కథ ప్రచారంలో ఉంది.
ఈ కథ ప్రకారం చూస్తే పక్షులంటే ఓ వ్యక్తి (అక్షయ్కుమార్)కి పిచ్చి ప్రేమ. ప్రపంచంలో ఎన్నో రకాల అరుదైన పక్షులను అతడు ప్రేమతో పెంచుకుంటూ ఉంటాడు. అయితే అతడు పెంచుతోన్న పక్షులన్ని చనిపోతూ ఉంటాయి. దీనిపై అతడు ఆరా తీస్తే ప్రపంచంలో పెరుగుతోన్న టెక్నాలజీ ఎఫెక్ట్తో చాలా పక్షిజాతులు అంతరించిపోతున్నాయని అతడికి తెలుస్తుంది.
దీంతో అతడు టెక్నాలజీపై ఈర్ష్య పెంచుకుంటాడు. అతడికి సెల్ టవర్లు చూస్తే ఒళ్లు మండిపోతుంది. వాటి నుంచి వచ్చే రేడియేషన్ వల్లే పక్షులు అంతమవుతున్నాయని భావిస్తాడు. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఉన్న సైంటిస్టులను, టెక్నాలజీని నాశనం చేయాలని అతడు భావిస్తాడు. ఇదిలా ఉంటే సైంటిస్ట్ అయిన (రజనీకాంత్) అవినీతిని అంతం చేసేందుకు ఓ రోబోను కనిపెడతాడు.
ఆ సైంటిస్ట్, అతడు కనిపెట్టిన రోబో, ఆ పక్షి ప్రేమికుడు… ప్రధానంగా ఈ మూడు పాత్రల చుట్టూ ‘2.0’ కథ ఉంటుందని సమాచారం. స్టోరీ చూస్తుంటేనే సినిమాలో విజువల్స్ అదిరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓ పాటకు ఏకంగా రూ. 32 కోట్లు ఖర్చు పెట్టారట. ఇక రోబో 2.0లో లెక్కకు మిక్కిలిగా హైలెట్స్ ఉన్నాయని టాక్.