సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్కు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రజనీ పొలిటికల్ ఎంట్రీపై దాదాపు దశాబ్ద కాలంగా జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు గత పది రోజులుగా బాగా ఎక్కువవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అప్పటి నుంచి రజనీ రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి తీవ్రతరమవుతోంది.
ఈ నేపథ్యంలోనే రజనీ చాలా రోజుల తర్వాత తన అభిమానులతో భేటీ కావడం కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ వార్తలకు ఊతమిస్తోంది. ఈ భేటీలో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడని ప్రశ్నించిన అభిమానులకు రజనీ ‘దేవుడు ఏది శాసిస్తే అదే చేస్తాను’ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. తాను రాజకీయాల్లోకి రావాలని దేవుడు ఆదేశిస్తే వస్తానని రజనీ చెప్పారు. ఈ వ్యాఖ్యలను బట్టి రజనీ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిగానే ఉన్నట్టు కనపడుతోంది.
ఈ సమావేశంలో ఒక పువ్వుపై బాబా గుర్తు ఫొటో ఉండడం గమనార్హం. ఇది రజనీకాంత్ – సురేష్కృష్ణ డైరెక్షన్లో వచ్చిన బాబా సినిమాలోని స్టైల్ను పోలి ఉంది. దీంతో రజనీ కొత్త పార్టీ పెడితే ఆ పార్టీ గుర్తు ఇదే అవుతుందన్న ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది.
రజనీని తమ పార్టీలోకి రావాలంటూ బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే ఒత్తిడి చేస్తున్నాయి. అయితే రజనీ అభిమానులు మాత్రం తమ హీరో కొత్త పార్టీ పెట్టి, కొత్త ట్రెండ్ సెట్ చేయాలని కోరుతున్నారు. ఏదేమైనా రజనీ పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికలకు ముందుగానే ఈ పార్టీ ఏర్పాటయ్యే సూచనలు ఉన్నాయి.