టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ సిట్ విచారణ ప్రకంపనలు రేపుతోంది. రవితేజకు కొందరు డ్రగ్స్ సరఫరా చేశారన్న ఆధారాలు సిట్ వద్ద ఉండడంతో రవితేజ వీటికి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటాడన్నదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్గా ఉంది. సిట్ నోటీసులు జారీ చేసిన 12 మందిలో 9వ వ్యక్తిగా రవితేజను సిట్ విచారిస్తోంది. రవితేజకు జీశ్యామ్తో ఎక్కువగా లింకులు ఉన్నాయని, అతడి ద్వారానే రవితేజ డ్రగ్స్ తెప్పించుకోవడంతో పాటు నేరుగానే డబ్బులు చెల్లించేవాడని తెలుస్తోంది.
ఈ విషయాలన్ని జీ శ్యామ్ సిట్కు చెప్పడంతో ఆ ఆధారాలతోనే రవితేజకు సిట్ నేరుగా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. శుక్రవారం విచారణ అంతా రవితేజ- జీ శ్యామ్ లింకుల గురించే ఉండనుందని తెలుస్తోంది. రవితేజను సిట్ బృందం వివిధ కోణాల్లో విచారించనున్నట్టు తెలుస్తోంది.
రవితేజకు నేరుగా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయా ? లేవా? అన్నది ఒక కోణం. రవితేజ విచారణ ముగిసిన తర్వాత మరో హీరో తనిష్, నందు, రవితేజ కారు డ్రైవర్ శ్రీనివాస రాజును కూడా సిట్ అధికారులు విచారించనున్నారు. ఇక సిట్ విచారణ కోసం రవితేజ ఇప్పటికే నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నాడు.
సిట్ విచారణలో ఎలా మాట్లాడాలన్న అంశంపై రవితేజ ఇప్పటికే న్యాయ నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.