టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోన్న డ్రగ్స్ ఉదంతంలో తొమ్మిదో రోజు టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ ఈ రోజు విచారణకు హాజరయ్యాడు. శుక్రవారం రవితేజ జూబ్లిహిల్స్లోని తన ఇంటి నుంచి నాంపల్లిలోని అబ్కారీ భవనానికి చేరుకున్నాడు. ఉదయం 10.30 గంటలకు రవితేజ విచారణ ప్రారంభమైంది. కెల్విన్ మొబైల్ కాల్ డేటాలో రవితేజ ఫోన్ నంబర్ ఉండటం.. విచారణలో కెల్విన్ రవితేజ పేరు చెప్పడంతో సిట్ అధికారులు రవితేజకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక రవితేజకు కెల్విన్కు ఉన్న సంబంధాలతో పాటు జీ శ్యామ్ రవితేజకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు సిట్కు కొన్ని ఆధారాలు లభ్యం కావడంతో పోలీసుల ఆ దిశగానే విచారణ ప్రారంభించారు. ఇక నిన్నటి వరకు విదేశాల్లో ఉన్న రవితేజ రెండు రోజుల క్రిందటే ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ రోజు ఉదయం రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాసరాజు కూడా విచారణకు హాజరయ్యారు.
కెల్విన్, జాక్తో ఉన్న సంబంధాలపై ప్రశ్నలతో ముందుగా రవితేజ విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఇక డ్రైవర్ శ్రీనివాసరాజుతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? శ్రీనివాసరాజు ద్వారా ఏమైనా డ్రగ్స్ తెప్పించుకున్నారా ? అన్న ప్రశ్నకు రవితేజ తొణకకుండా ఆన్సర్ చేసినట్టు సమాచారం.
తన సొంత తమ్ముడైన భరత్ డ్రగ్స్కు బానిస కావడంతో అతడినే దూరం పెట్టిన తాను డ్రగ్స్ ఎందుకు వాడతానని రవితేజ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక రవితేజ నోటీసులు అందుకున్నాక ముందుగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది.