టాలీవుడ్లో ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనట్టుగా ఒకేసారి 3 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. లై, నేనే రాజు నేనే మంత్రి, జయజానకి నాయక సినిమాలు అతి కష్టమ్మీద థియేటర్లు దక్కించుకున్నాయి. ఈ పోటీ మధ్య జయజానకి నాయక సినిమాకు థియేటర్లు తగ్గాయి. ఫస్ట్ వీక్లో థియేటర్లు తగ్గినా కూడా జయ జానకి నాయక ఈ సినిమా కంటే చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన రాజు మంత్రికి పోటీగా వసూళ్లు రాబట్టింది.
రాజు మంత్రికి ఓవర్సీస్లో ఎక్కువ వసూళ్లు రావడంతో సరిపోయింది కాని లేకుంటే జయ జానకి నాయకదే పై చేయి అయ్యేది. ఇక రెండో వారం స్టార్ట్ అయ్యే సరికి సీన్ రివర్స్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో జయజానకి నాయక సినిమాకు ఏకంగా వంద థియేటర్లు పెరిగాయి. మరీ ముఖ్యంగా విడుదలైన రెండో వారం ఇలా వంద థియేటర్లు పెరగడంతో సినిమా వసూళ్ల పెరగనున్నాయి.
బీ, సీ సెంటర్లలో క్లాస్ సినిమా అయిన లై సినిమాకు ఎక్కువ థియేటర్లు దొరికాయి. ఫస్ట్ వీక్కే లై చేతులెత్తేయడంతో ఇప్పుడు లై థియేటర్లు ఖాళీ చేసి జయ జానకి నాయకకు ఇస్తున్నారు. బీ, సీ సెంటర్లలో బోయపాటి మార్క్ మాసిజానికి మంచి క్రేజ్ ఉండడంతో వంద థియేటర్లు దక్కాయి.
మరోవైపు రానా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కూడా రెండో వారానికి థియేటర్లు తగ్గాయి. ఈ థియేటర్లలో కూడా జయ జానకి నాయకనే వేస్తున్నారు. ఓవరాల్గా రాజు మంత్రి, జానకి నాయక మధ్యలో లై నలిగిపోయింది. ఇక ఈ మూడు సినిమాల దెబ్బతో ఈ వారం రిలీజ్ అయిన ఆనందో బ్రహ్మ సినిమా పరిమిత స్థాయిలోనే రిలీజైంది.