ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైనట్టే కనిపిస్తోంది. డీ లిమిటేషన్ ఆశ చూపి చంద్రబాబు విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేషన్ జరిగితే ఓకే…లేనిపక్షంలో ఇప్పుడు వాళ్లకు టిక్కెట్ల కేటాయింపు చంద్రబాబుకు పెద్ద తలపోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివర్స్గేర్లో వైసీపీలోకి వెళుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రస్తుతం అదే జరిగింది.
వీళ్ల సంగతి ఇలా ఉంటే కొందరు సీనియర్లు సైతం తమ, తమ వారసుల పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీ వైపు చూస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు తీరుతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వైసీపీ వైపు చూస్తున్నట్టు టాక్. ఆయన కొద్ది రోజులుగా అధికార పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూచిపూడి లో నిరాహార దీక్షకి కూర్చున్న ఆయన ఇటీవల తరచూ ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రకటనలు ఇస్తున్నారు. పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినా ఆయనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ దాసరికి నివాళులు అర్పించినప్పుడు, సినారె భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించినప్పుడు యార్లగడ్డ జగన్తో అత్యంత సన్నిహితంగా ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో తన తనయుడు యార్లగడ్డ శివరాం ప్రసాద్ను విశాఖ పట్నం నుంచి అసెంబ్లీ బరిలోకి దింపాలన్నది ఆయన ప్లాన్గా సన్నిహితులు చెపుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న శివరాం వచ్చే ఎన్నికల్లో విశాఖ టౌన్లో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది.
ఇక మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేతగా ఉన్న దగ్గుపాటి పురందేశ్వరి సైతం తన తనయుడు పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీ వైపే చూస్తున్నట్టు టాక్. ఆమె వైసీపీ వార్తలు గత నాలుగైదు నెలలుగా వస్తున్నాయి. బీజేపీలో ఆమెను పక్కన పెట్టేయడంతో ఆమె తీవ్ర ఆవేదనతో ఉన్నారు. తమ తనయుడు దగ్గుపాటి చెంచురామ్ను వచ్చే ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలన్నది దగ్గుపాటి దంపతుల ప్లాన్. చెంచురామ్ కామినేని గ్రూప్ చైర్మన్ కామినేని సూర్యనారాయణ మనుమరాలిని వివాహం చేసుకున్నారు. కామినేని సూర్యనారాయణ కుమారుడు…. ఎన్టీఆర్ మనుమరాలు(నందమూరి సాయికృష్ణ) కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు.