2019 ఎన్నికలు ఏపీలో అధికార టీడీపీకి చావో రేవోగా మారనున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలవడం చంద్రబాబు ప్రతిష్టకు పెద్ద సవాల్గా మారనుంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల కోసం నారా, నందమూరి ఫ్యామిలీలో రెండూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీల నుంచి మొత్తం నలుగురు ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖరారైంది.
సీఎం చంద్రబాబు కుప్పం నుంచే పోటీ చేయడం ఖాయం. ఇక ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ వచ్చే ఎన్నికల్లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. లోకేశ్ కృష్ణా జిల్లాలోని పెనమలూరు నుంచి పోటీ చేయడం కన్ఫార్మ్ అయినట్టు టీడీప వర్గాలు చెపుతున్నాయి. ఇక బాలయ్య మళ్లీ ఎలాగూ హిందూపురం నుంచే పోటీ చేయనున్నారు.
ఇక బాబు కోడలు, లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారన్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ యంగ్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీకి మద్దతుగా ప్రచారం చేస్తారని, ఈ క్రమంలోనే ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి తిరిగి దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వీరికి తోడుగా ఇప్పుడు మరో నందమూరి హీరో కూడా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. నందమూరి హీరో తారకరత్న గత రెండు ఎన్నికల్లోను కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేశాడు. ఈ క్రమంలోనే ఆయన వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి లేదా చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తారని టీడీపీ ఇన్నర్ సైడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కోడెల వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అప్పుడు ఖాళీ అయ్యే సత్తెనపల్లి లేదా మంత్రి ప్రత్తిపాటి నరసారావుపేట ఎంపీగా వెళితే చిలకలూరిపేటలో అయినా తారకరత్న పోటీ చేస్తారని, ఈ రెండు నియోజకవర్గాల్లో గెలుపు పరిస్థితులపై ఆయన తన అనుచరులతో సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది. మరి తారకరత్న పొలిటికల్ ఎంట్రీకి చంద్రబాబు ఎంత వరకు ఓకే చెపుతారో ? చూడాలి.