ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ పార్టీలకు సంబంధించి నేతలు ఒక్కొక్కరు ఒకే విధంగా కామెంట్లు కుమ్మరిస్తున్నారు. పొత్తులపై ఇప్పటి నుంచే నేతలు పెద్ద పెద్ద చర్చలు కూడా చేపట్టారు. మొత్తంగా ఈ కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది అనే వార్తలైతే పెద్ద ఎత్తున వస్తున్నాయి. బీజేపీతో పొత్తు వద్దంటే వద్దని టీడీపీ నేతలు చెబుతున్నారట. ఇక, టీడీపీతో పొత్తు వద్దని ఇప్పటికే బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అధినాయకత్వం ముందు చెప్పుకొచ్చారు.
అయితే, నంద్యాల రిజల్ట్ తర్వాత బీజేపీ వైఖరిలో మార్పు వచ్చింది. ఇక, టీడీపీతోనే పొత్తు కొనసాగించాలని, ఆ పార్టీతోనే ముందుకు వెళ్లాలని కమల నాథులు డిసైడ్ అయ్యారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కమలనాధులతో కరచాలనం వల్ల లాస్ భారీగా ఉంటుందని బాబుకు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇటీవల చంద్రబాబు జరిపిన సర్వేల్లోనూ బీజేపీ వీక్గా ఉందని, దాంతో ఉంటే .. అనవసరంగా దానిని పెద్దది చేసినట్టే అవుతుందని వెల్లడి కావడం విశేషం. ఏపీలో మెజారిటీ ప్రజలు బీజేపీ అంటేనే మండిపోతున్నట్లు తేలింది.
2014 ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు చాలా తేడా కన్పిస్తోంది. గత ఎన్నికల్లో మోడీ హవా బలంగా వీచింది. దీంతో పాటు మోడీపై ఉన్న విశ్వాసం, చంద్రబాబుపై ఉన్న నమ్మకానికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జతకట్టడమూ టీడీపీకి కలిసొచ్చింది. అయితే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటితో మోడీ పాలనపై కొంత వ్యతిరేకత వచ్చింది. మోడీ ఏదో చేస్తాడనుకుంటే.. ఏదీ చేయలేకపోయాడన్నది మేధావి వర్గం నుంచి సామాన్యుల వరకూ వెల్లడవుతున్న అభిప్రాయాలు.
దీంతో పాటు ఏపీకి ఇచ్చిన హామీల విషయంలో బీజేపీ మోసం చేసిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈ పరిణామాలతో ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితి చర్చలపై నడుస్తోంది. అయితే, దీనిపై ఇప్పటికప్పుడు ఇతమిత్థంగా ఏమీ తేల్చలేని పరిస్థితి మాత్రం నెలకొంది. మరి 2019 నాటికి ఏం జరుగుతుందో చూడాలి.