ఏపీలో రాజకీయంగా బాలమైన ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికార టీడీపీ, విపక్ష వైసీపీ హోరాహోరీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఫ్యామిలీ తమ పార్టీలో చేరితే బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నాయి. అధికార టీడీపీ ఆ ఫ్యామిలీకి ఓ ఎంపీ సీటుతో పాటు మరో ఎమ్మెల్యే సీటు ఇస్తే, విపక్ష వైసీపీ ఏకంగా రెండు ఎమ్మెల్యే సీట్లతో పాటు ఓ ఎంపీ సీటు ఆఫర్ చేసిందట. ఓవరాల్గా ఈ ఫ్యామిలీని తమ వైపునకు తిప్పుకునేందుకు ఈ రెండు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో పెద్ద హాట్ టాపిక్గా మారింది.
ఏపీ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్రెడ్డి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కర్నూలు జిల్లాలో కోట్ల ఫ్యామిలీకి పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ బలంగా ఉండేది. టీడీపీ ఇక్కడ కాన్సంట్రేషన్ చేయడంతో ఇప్పుడు ఇరు పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నాయి. కోట్ల ఫ్యామిలీని కూడా తమ వైపునకు తిప్పుకుంటే తమకు తిరుగు ఉండదని రెండు పార్టీలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీలో చేరితే కర్నూలు లోక్సభ సీటుతో పాటు ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డికి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న సూర్యప్రకాష్రెడ్డికి కర్నూలు ఎంపీ సీటు డోన్, పత్తికొండ లేదా వారు కోరుకున్న మరో సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం నుంచి కోట్లకు ఆఫర్ వెళ్లిందట.
ఇక వైసీపీ సంగతి ఇలా ఉంటే టీడీపీ అధినాయకత్వం కూడా కోట్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కోట్లకు స్వయాన బావ, ప్రముఖ సినీ నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డితో కలిసి అమరావతిలో చంద్రబాబును ఇటీవల కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య 45 నిమిషాలకు పైగా ఏకాంతంగా చర్చలు జరిగాయి. జిల్లా రాజకీయలపైనే వారు చర్చించారని సమాచారం. ఇక టీడీపీలో చేరితే కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆలూరు ఎమ్మెల్యే సీటును ఆఫర్ చేశారట. మరి కోట్ల రూటు ఎలా ఉంఉందో ? చూడాలి.