ఏపీలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు ఎన్నికలు తమకు చావో రేవోగా రెండూ పార్టీలు పోరాడాయి. రెండు చోట్ల టీడీపీ తిరుగులేని విజయం సాధించింది. కాపు ఉద్యమం ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండడంతో కాకినాడ రిజల్ట్ ఎలా ఉంటుందా ? అన్న టెన్షన్ సీఎంగా చంద్రబాబుకు ఎక్కవుగానే కనిపించింది. ఇక్కడ కాపులందరూ కూడా వార్ వన్సైడ్ చేసేసి టీడీపీని గెలిపించారు.
ఇంత కీలకమైన ఎన్నికల్లో హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు ఆయన ఫ్యామిలీ వ్యవహరించిన తీరు మాత్రం టీడీపీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎన్నిక బాధ్యతలను చంద్రబాబు ముందుగా రాజప్పకు అప్పగించారు. ఆయన జనరల్ వార్డుల్లో మెజార్టీ వార్డులు కాపులకే కేటాయించారు. రాజప్ప పార్టీ కోసం ముందునుంచి పనిచేయకుండా ఉన్న తన అనుచరులకు కూడా టిక్కెట్లు కట్టబెట్టారన్న విమర్శలు వచ్చాయి. ఇక్కడ కొన్ని చోట్ల డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే టీడీపీకి వెన్నుదన్నుగా ఉండే కమ్మ సామాజికవర్గానికి ఇక్కడ ఆ పార్టీ ఒక్క కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వలేదు. వైసీపీ కమ్మ వర్గానికి సీటు ఇచ్చినా టీడీపీ మాత్రం ఇవ్వకపోవడంతో వారంతా రాజప్పపై గుర్రుగా ఉన్నారు.
అక్కడితో ఆగని రాజప్ప కమ్మ కులాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబు దృష్టికి వెళ్లడం, చంద్రబాబు వెంటనే ఎన్నికల బాధ్యతల నుంచి రాజప్పను తప్పించేసి ఆ ప్లేస్లో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు రంగంలోకి దింపడం జరిగాయి. ఇక కాకినాడ వార్లో రాజప్ప ఫ్యామిలీ పార్టీ కన్నా కులాన్నే సపోర్ట్ చేసినట్టు కూడా చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.
చినరాజప్ప సంగతి అలా ఉంటే ఆయన సోదరుడు అయిన జగ్గప్పనాయుడు కూడా పార్టీ కన్నా తమ కులం తరపున పోటీ చేసిన వైసీపీ వాళ్లకు సపోర్ట్ చేసిన తీరుపై కాకినాడలో కొన్ని వర్గాలు మండిపడుతున్నాయి. 30వ వార్డు నుంచి వైసీపీ మేయర్ అభ్యర్థిగా రాగిరెడ్డి ఫ్రూటీ కుమార్ భార్య రాగిరెడ్డి చంద్రకళా దీప్తి పోటీ చేశారు. ఆమెపై టీడీపీ నుంచి వైశ్య సామాజికవర్గానికి చెందిన బాదం బాలకృష్ణ పోటీ చేశారు.
మొత్తం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వార్డులోనే ఎక్కువ ఖర్చు అయ్యింది. టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ పార్టీ ఇచ్చిన సొమ్ము కాకుండా వ్యక్తిగతంగా కూడా బాగా ఖర్చు చేశారు. అయినా ఆయన 500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ వైసీపీ నుంచి గెలిచిన చంద్రకళా దీప్తి భర్త ఫ్రూటీ కుమార్కు చినరాజప్ప సోదరుడు జగ్గప్పనాయుడుకు ఉన్న సంబంధాల నేపథ్యంలో జగ్గప్పనాయుడు కులం లాబీయింగ్తో వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసినట్టు బాబుకు ఫిర్యాదులు వెళ్లాయని టాక్.
జగ్గప్పనాయుడు వైసీపీ నాయకుడు ఫ్రూటీ కుమార్ కలిసి సెటిల్మెంట్ల బ్యాచ్ అన్న టాక్ కూడా కాకినాడలో ఉంది. వీరు రీసెంట్గా సామర్లకోట మండలానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన సెటిల్మెంట్ను వైజాగ్లో చేశారని కూడా బాబుకు ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఏదేమైనా చినరాజప్ప ఫ్యామిలీ కాకినాడ వార్లో చేసిన క్యాస్ట్ పాలిటిక్స్పై ఇప్పుడు బాబు సీరియస్గా ఉన్నట్టు సమాచారం.