2019 ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉండగానే ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీడీపీ మరోసారి గెలిచేందుకు పక్కా ప్లానింగ్తో ముందుకు వెళుతుంటే విపక్ష వైసీపీ ఎలాగైనా గెలుపుకోసం ఎక్కడ లేని వ్యూహాలు పన్నుతోంది. ఇక జనసేన వ్యూహం ఎలా ఉంటుందో ఇప్పటికైతే అర్థం కావడం లేదు. ఇక మరోసారి విజయం సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న చంద్రబాబు ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోన్న కొందరు సిట్టింగ్లకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.
ఈ లిస్టులో ఎంపీ స్థానాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీలు, లోక్సభ నియోజకవర్గాల ఇన్చార్జ్ల్లో ఆరుగురిని పక్కన పెట్టేస్తారని టాక్. ఈ లిస్టులో సిట్టింగ్ ఎంపీల్లో నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్పతో పాటు చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఉన్నట్టు టాక్. ఇక వీరితో పాటు లోక్సభ నియోజకవర్గాల ఇన్చార్జ్ల విషయానికి వస్తే కర్నూలు నుంచి బీటీ నాయుడు, నంద్యాల ఇన్చార్జ్ ఫరూఖ్, గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన రాజంపేట సీటులో కూడా టీడీపీ కొత్త క్యాండెట్తో పోటీలో ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఆరు ఎంపీ స్థానాల విషయానికి వస్తే నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును పక్కన పెట్టి ఆయన కుమారుడికి గుంటూరు జిల్లాలో ఎంపీ సీటు ఇస్తారని తెలుస్తోంది. రాయపాటికి టీటీడీ చైర్మన్ లేదా మరో పదవి ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఇటీవల వరుస కాంట్రవర్సీ వ్యాఖ్యలతో చంద్రబాబు ఆగ్రహానికి గురైన చిత్తూరు ఎంపీ శివప్రసాద్ను వచ్చే ఎన్నికల్లో దాదాపు పక్కన పెట్టేయనున్నట్టు తెలుస్తోంది.
ఇక హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆయన రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచినా పార్టీకి, అనంతపురం జిల్లా ప్రజలకు చేసిందేమి లేదు. కర్నూలు జిల్లాలో నంద్యాల, కర్నూలు రెండు ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఈ రెండు సీట్లలో కొత్త అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో బీజేపీకి వదిలిపెట్టిన రాజంపేటలో ఈ సారి టీడీపీ పోటీ చేయనుంది. అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా సాయిప్రతాప్ రంగంలో ఉండే ఛాన్సులు ఉన్నాయి.