శిష్యుడుపై క‌సి తీర్చుకోనున్న గురువు..!

తెలంగాణ కాంగ్రెస్ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ లీడ‌ర్ అయిన జానారెడ్డి ఇప్పుడు త‌న శిష్యుడుపైనే క‌క్ష తీర్చుకునే ప‌నిలో ఉన్నార‌ట‌. తాను ఎంతో న‌మ్మి టిక్కెట్ ఇప్పిస్తే గెలిచాక త‌న‌కు పంగ‌నామాలు పెట్టి త‌న శ‌త్రువుల‌తో క‌లిసి టీఆర్ఎస్‌లో చేర్చ‌డాన్ని జానా అస్స‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. దీంతో ఇప్పుడు త‌నను మోసం చేసిన త‌న శిష్యుడును ఎలాగైనా ఓడించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

జానారెడ్డి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అదే సందర్భంలో తన శిష్యుడైన న‌ల్ల‌మోతు భాస్కరరావుకు మిర్యాలగూడ టిక్కెట్ ఇప్పించారు. భాస్కరరావు కృష్ణా జిల్లాకు చెందిన వ్య‌క్తి అయినా మిర్యాల‌గూడలో సెటిల‌ర్ అయ్యారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో జానా ప‌ట్టుబ‌ట్టి మ‌రీ భాస్క‌ర‌రావుకు టిక్కెట్ ఇప్పించారు. జానా సాగ‌ర్ నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్నా మిర్యాల‌గూడ‌లో కూడా ఆయ‌నకు ప‌ట్టుంది.

ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన భాస్క‌ర‌రావు న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డితో క‌లిసి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. దీంతో ఇప్పుడు త‌న శిష్యుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు జానా అక్క‌డ త‌న కుమారుడినే రంగంలోకి దింపుతున్నారు. తన కుమారుడైన రఘువీర్ రెడ్డిని మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని జానా గట్టిగా భావిస్తున్నారు. ర‌ఘువీర్‌రెడ్డి మిర్యాల‌గూడ‌లో అనేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ జ‌నాల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఇక్క‌డ ర‌ఘువీర్‌రెడ్డిని రంగంలోకి దింపుతోన్న జానా ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌ను కొట్టే ప్లాన్ వేస్తున్నారు. అటు త‌న‌ను న‌మ్మించి పార్టీ నుంచి వెళ్లిపోయిన శిష్యుడుని ఓడిస్తాన‌ని జానా పైకి శ‌ప‌థం చేస్తున్నా, ఈ ప్లాన్‌లోనే ఆయ‌న కుమారుడిని రాజ‌కీయ ఆరంగ్రేటం చేయించే ప్లాన్ కూడా పూర్త‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇక జానా కొడుకు పొలిటిక‌ల్ ఎంట్రీకి మిర్యాల‌గూడే క‌రెక్ట్ అన్న టాక్ కూడా ఇప్ప‌టికే టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. మ‌రి జానా ప్ర‌య‌త్నాలు ఎంత వ‌రకు స‌క్సెస్ అవుతాయో ? చూడాలి.