టాలీవుడ్లో గత రెండు రోజులుగా డ్రగ్స్ ఇష్యూ పెద్ద దుమారం రేపుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. ఈ లిస్టులో తాము 19 మందిని గుర్తించామని వీరిలో 12 మందికే నోటీసులు జారీ చేశామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇక రెండో లిస్టులో రేపు మరో 7 గురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేస్తామని ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండో లిస్టులో ఇద్దరు అగ్రహీరోలు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి తండ్రులు టాలీవుడ్లో అగ్ర నిర్మాతలు కావడంతో వీరి పేర్లు బయటపెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ జాబితాలోనే సినిమా ఫంక్షన్లలో హీరోలను మోసేసే ఓ బడా బినామి నిర్మాత కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక పూరి గ్యాంగ్కే చెందిన మరో వ్యక్తి పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. అయితే రెండో లిస్టులో అగ్ర నిర్మాతల తనయులు ఉండడంతో వీరి పేర్లు బయటకు వచ్చేవరకు ఈ లిస్టును బయటపెడతారా ? లేదా ? అన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది.