సెంటిమెంట్ రిపీట్‌ చేస్తున్న బాలయ్య

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ జెట్‌స్పీడ్‌తో సినిమాలు చేసేస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య ఆ వెంట‌నే పూరి జ‌గ‌న్నాథ్‌తో త‌న 101వ సినిమా పైసా వ‌సూల్ కంప్లీట్ చేసేశాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఈ సినిమా రిలీజ్ కాకుండానే బాల‌య్య అప్పుడే త‌న 102వ సినిమాను స్టార్ట్ చేసేశాడు. బాల‌య్య 102వ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జ‌రుగుతోంది. ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ కేఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మాస్ అంశాల‌తో పాటు ఎమోష‌న‌ల్ అంశాలు పుష్క‌లంగా ఉన్నాయంటున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కాగా మరో ఇద్దరు ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక బాల‌య్య‌కు ముగ్గురు హీరోయిన్ల సెంటిమెంట్ బాగా క‌లిసొస్తోంది. బాల‌య్య సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్న స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహానాయుడు, సింహా సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి.

ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు ఉండ‌డంతో ఆ సెంటిమెంట్ వ‌ర్క్ అవుతుంద‌న్న ఆశ‌ల‌తో బాల‌య్య అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, అశుతోష్ రానా, బ్రహ్మానందం న‌టిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూర్చనుండగా రామ్ ప్రసాద్ కెమెరా వర్క్ చేయనున్నారు. ఈ సినిమాకు జ‌య‌సింహా అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉండ‌గా 2018 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.