ఎన్టీఆర్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫైట్‌లో గెలుపు ఎవ‌రిదంటే

ఈ యేడాది ద‌స‌రాకు ఇద్ద‌రు టాలీవుడ్ అగ్ర‌హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్నారు. రెండు సినిమాల‌పై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ ముందుగా ఈ నెల 21న దిగుతుంటే, మ‌హేష్‌బాబు స్పైడ‌ర్ సినిమా 27న దిగుతోంది. ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోలలో ఎవ‌రి స్టామినా వారిది. ఇక గ‌తంలో ఈ ఇద్ద‌రు హీరోలు మూడుసార్లు ఒకేసారి త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డ్డారు.

2003 సంక్రాంతికి మ‌హేష్ ఒక్క‌డు – ఎన్టీఆర్ నాగ సినిమాలు వ‌చ్చాయి. నాగ ప్లాప్ అయితే ఒక్క‌డు అప్ప‌టి వ‌ర‌కు తెలుగు సినిమా చ‌రిత్రలో ఉన్న చాలా రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. ఆ త‌ర్వాత 7 సంవ‌త్స‌రాల‌కు 2010 దస‌రాకు ఎన్టీఆర్ బృందావ‌న‌, మ‌హేష్ ఖ‌లేజా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. బృందావ‌నం హిట్ అయితే ఖ‌లేజా ప్లాప్ అయ్యింది. ఈ సారి ఎన్టీఆర్ హిట్ కొట్టాడు.

ఇక వీరిద్ద‌రు ముచ్చ‌ట‌గా మూడోసారి 2011లోనే మళ్లీ త‌ల‌ప‌డ్డారు. మ‌హేష్‌బాబు దూకుడు, ఎన్టీఆర్ ఊస‌ర‌వెల్లి సినిమాలు వ‌చ్చాయి. దూకుడు సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్‌, ఊస‌ర‌వెల్లి ప్లాప్ అయ్యాయి. ఇలా ఈ మూడుసార్లలో మహేష్‌బాబు రెండుసార్లు హిట్ కొట్టి పైచేయి సాధించాడు. ఇక ఇప్పుడు వీరిద్ద‌రు ఈ ద‌స‌రాకు నాలుగోసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నారు. 21న జై ల‌వ‌కుశ‌, 27న స్పైడ‌ర్ వ‌స్తున్నాయి. ఈ రెండు సినిమాల‌కు రూ.100 కోట్ల బిజినెస్ జ‌రిగింది. మ‌రి ఈ సారి ఎవ‌రు పైచేయి సాధిస్తారో ? చూడాలి.