బాల‌య్య‌-చిరును క‌లుపుతోన్న యంగ్ హీరో

ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌కు రెండు ప్ర‌ధాన క‌ళ్లు… తిరుగులేని స్టార్లు ఆ ఇద్ద‌రు హీరోలు. సెంచ‌రీలు దాటేసిన ఆ ఇద్ద‌రు హీరోలు చాలా అరుదుగా మాత్ర‌మే ఒకే వేదిక‌పైన క‌నిపిస్తుంటారు. ఆ ఇద్ద‌రు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత వీరు ఒకే వేదిక‌పైకి రానున్నారు. వీరిద్ద‌రిని ఓ యంగ్ హీరో ఒకే వేదిక‌మీద‌కు తీసుకురానున్నాడు.

బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌కత్వం వ‌హించిన జ‌య జాన‌కి నాయ‌క చిత్రం ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు భారీగానే అందుకొంటోంది. `జ‌య జాన‌కి నాయ‌క‌` థ్యాంక్స్ మీట్‌ని హంస‌ల‌దీవిలో జ‌ర‌పాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. ఈ సినిమాలో ఇంట‌ర్వెల్ బ్యాంగ్ త‌ర్వాత వ‌చ్చే భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను అక్క‌డే చిత్రీక‌రించారు. ఈ ఎపిసోడ్‌కు మంచి స్పంద‌న కూడా వ‌స్తోంది. ఈ సినిమా చూసిన ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్ కూడా ఈ సీన్‌తో పాటు సాగ‌ర‌సంగ‌మం విశిష్ట‌త‌ను తెలిపేలా రాసిన సాంగ్‌ను మెచ్చుకున్నారు.

ఈ సినిమా ఫంక్ష‌న్లు అన్ని హైద‌రాబాద్‌లోనే జ‌రిగాయి. ఇక ఇప్పుడు ఏపీ ప్రేక్ష‌కుల‌ను కూడా క‌ల‌వాల‌న్న ఉద్దేశంతోనే ఈ చిత్ర యూనిట్ ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ ప్లాన్ చేసింది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి, బాల‌య్య‌ల‌ను పిలుస్తున్నార‌ట‌. మెగాస్టార్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక ద‌ర్శ‌కుడు బోయ‌పాటికి ఫోన్ చేసి మ‌రీ ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు.

ఇక ఆయ‌న 152వ సినిమా కూడా బోయ‌పాటితోనే ఉండ‌నుంది. ఇక బోయ‌పాటికి బాల‌య్య‌కు ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాల‌య్య నెక్ట్స్ సినిమా బోయ‌పాటితోనే ఉంది. వ‌చ్చే ఆగ‌స్టు నుంచి ఈ సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోలను ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌కు ఆహ్వానించ‌గా వీరు ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం. వీరిద్ద‌రు ఒకే వేదిక మీద క‌న‌ప‌డితే టాలీవుడ్ సినీ అభిమానుల ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు.