నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న జై లవకుశ సినిమా బుధవారం మధ్యాహ్నం సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. బుధవారం ఉదయం సెన్సార్కు వెళ్లిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ కంప్లీట్ తర్వాత ల్యాబ్ నుంచి సినిమాకు అదిరిపోయే టాక్ వినిపిస్తోంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం కామెడీతో నడుస్తూ, ట్విస్టుల మీద ట్విస్టులతో ఒక ఎన్టీఆర్ పాత్రలోకి మరో ఎన్టీఆర్ ఎంట్రీ అవుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందట. ఇక ఇంటర్వెల్ టైంలో వచ్చే ట్విస్ట్ అదిరిపోయి అసలు కథలోకి టర్న్ అవుతుందట.
ఇక సెకండాఫ్లో యాక్షన్ + ఎమోషన్లతో సినిమా రన్ అవుతుందట. సినిమాలో మూడు పాత్రలు పోషించిన ఎన్టీఆర్ ఒక పాత్రకి మరొక పాత్రకి ఏమాత్రం సంబంధం లేకుండా మూడు పాత్రల్లో మూడు వైవిధ్యాలతో తన నట విశ్వరూపాన్ని చూపించాడట. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం పండగ చేసుకోవటం ఖాయం అన్న టాక్ వచ్చేసింది.
ఇక జై లవకుశ ఎన్టీఆర్ను అటు క్లాస్ ఫ్యాన్స్తో పాటు ఇటు కుటుంబ ప్రేక్షకులను మరింత దగ్గర చేస్తుందనడంలో డౌట్ లేదంటున్నారు. అన్న దమ్ముల అనుబంధాన్ని ఈ సినిమా ప్రతీ అన్నకి మరియు ప్రతీ తమ్ముడికి కనెక్ట్ అయ్యేలా చాలా బాగా చూపించారంట. ఇక మాస్ ప్రేక్షకుల విషయంలో కూడా రిపీటెడ్ ప్రేక్షకులు వచ్చేలా ఈ సినిమా ఉందంట. జై లవకుశ ఈ నెల 21న థియేటర్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే.