టాలీవుడ్ హీరోల్లో చాలామందికి హోమ్ బ్యానర్స్ ఉన్నాయి. హీరోలకు సొంతంగానో లేదా వారి కుటుంబ సభ్యులకో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నాగ్కు అన్నపూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఇక మరో అగ్రహీరో బాలకృష్ణ కుటుంబానికి సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. మరో నందమూరి హీరో కళ్యాణ్రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక నేటి తరం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఎక్స్క్లూజివ్గా తమ కోసం ఒక బేనర్ పెట్టుకున్నారు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కోసం వీరి బాటలోనే నడుస్తున్నాడు. తనకంటూ సొంతంగా ఓ బ్యానర్ పెట్టుకుంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వి పేర్లు కలిసొచ్చేలా బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ పేరుతో ఈ కొత్త బ్యానర్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది.
బాలయ్య తన తండ్రి, దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు అయిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తోనన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంతకు ముందుగా విష్ణు ఇందూరిని నిర్మాతగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలయ్యే స్వయంగా ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు దర్శకుడిగా తేజ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు ఎన్టీఆర్ బయోపిక్ను లక్ష్మీపార్వతి కోణంలో తీయడానికి వర్మ రెడీగా ఉన్న నేపథ్యంలో బాలయ్య త్వరపడుతున్నట్లు తెలుస్తోంది.