నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. వరుసగా ఏడు సక్సెస్లను దక్కించుకున్న నాని తాజాగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ కానుకగా సెలవులను యూజ్ చేసుకునేలా సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్లో అదే టైంలో ఇద్దరు ప్రముఖుల వారసుల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో నాని సినిమాను ముందుకు జరిపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
నాని సినిమాకు మంచి బజ్ ఉంది. డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేస్తే సెలవులను టార్గెట్గా చేసుకుని మంచి వసూళ్లు సాధించవచ్చని ఆ సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. అయితే అదే టైంలో అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా హలో వస్తోంది. నాగార్జున నిర్మాతగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు బుక్ చేస్తున్నారు.
ఇక డిసెంబర్ 24న అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకోవడంతో పాటు దిల్ రాజును ఒప్పించి నాని ఏంసీఏ సినిమాను వారం రోజులు ముందుకు జరిపించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అంటే డిసెంబర్ 15న ఏంసీఏ సినిమాను రిలీజ్ చేయించేలా చేస్తున్నారట.
నాని సినిమా వారం రోజుల ముందుగానే వస్తే వరుస సెలవులను నాని మిస్ చేసుకున్నవాడవుతాడు. దీంతో ఆ సినిమాకు భారీ కలెక్షన్లు రావడం కూడా కష్టమవుతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఏదేమైనా మంచి పాజిటివ్ బజ్ ఉన్న నాని సినిమాకు ఇలాంటి ఇబ్బంది రావడం విచిత్రమే..!