జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు గుడి…. ఎక్క‌డో తెలిస్తే షాక్‌

సినీ హీరోల‌కు గుళ్లు క‌ట్టి పూజ‌లు చేయ‌డం అనే సంస్కృతి ముందుగా త‌మిళ‌నాడులో ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడో రెండు ద‌శాబ్దాల క్రిత‌మే మ‌న త‌మిళ సినీజ‌నాలు ఖ‌ష్బూకు గుడి క‌ట్టి పూజ‌లు చేశారు. త‌ర్వాత ర‌జ‌నీకాంత్‌, ఇక కొద్ది రోజుల క్రితం అయితే బొద్దుగుమ్మ న‌మిత‌కు కూడా గుళ్లు క‌ట్టి పూజ‌లు చేశారు. తెలుగులో ఈ సంస్కృతి పెద్ద‌గా లేదు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి మ‌న టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా వ‌చ్చి చేరాడు.

టాలీవుడ్‌లో విభిన్న‌మైన క‌థ‌లు, విల‌క్ష‌ణ పాత్ర‌లు ఎంచుకుంటూ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా జై ల‌వ‌కుశ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ ఖాతాలో వ‌రుస‌గా నాలుగో హిట్ ప‌డింది. సినిమా సినిమాకు, రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ పోతోన్న ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ గుడి క‌డుతున్నారు. మ‌రో షాక్ ఏంటంటే ఈ గుడి మ‌న తెలుగు రాష్ట్రాల అభిమానులు క‌ట్ట‌డం లేదు… పొరుగు రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క ఎన్టీఆర్ అభిమానులు క‌డుతున్నారు.

ఎన్టీఆర్‌కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోను అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. అక్కడ ఆయన సినిమాలకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఎన్టీఆర్ తాజా సినిమా జై ల‌వ‌కుశ క‌ర్ణాట‌క‌లో ఏకంగా రూ.10 కోట్లు కొల్ల‌గొట్టిందంటే ఎన్టీఆర్ క్రేజ్ అక్క‌డ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఎన్టీఆర్‌పై త‌మ‌కు ఉన్న అనంత అభిమానాన్ని చాటుకునేందుకు గాను వారు గుడి క‌ట్టాల‌ని డిసైడ్ అయ్యారు.

క‌ర్ణాట‌క‌లో తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువుగా ఉండే బ‌ళ్లారి జిల్లాలో ఈ గుడి నిర్మితంకానుంది. ఈ గుడి క‌ట్టే ముహూర్తం, ఇత‌ర వివ‌రాలు వారు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు. ఏదేమైనా పొరుగు స్టేట్‌లో మ‌న భాష‌కు చెందిన హీరోకు అభిమానులు గుడిక‌ట్ట‌డం అంటే ఎన్టీఆర్ అసాధార‌ణ క్రేజ్ ఎలా ఉందో అర్థ‌మ‌వుతోంది.