ప్రస్తుతం టాలీవుడ్లో ఎన్టీఆర్ బయోపిక్ల గురించే చర్చ నడుస్తోంది. ఒకటి సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ అయితే రెండోది ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తెరకెక్కించే ఎన్టీఆర్ బయోపిక్. నిన్నటి వరకు వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ హడావిడి కనిపిస్తే తాజాగా బాలయ్య బయోపిక్కు దర్శకుడిగా తేజ కన్ఫార్మ్ అవ్వడంతో ఇప్పుడు ఈ బయోపిక్ హడావిడి కూడా మొదలైపోయింది.
వర్మ బయోపిక్కు వైసీపీ లీడర్ రాకేష్రెడ్డి నిర్మాత కాగా…. బాలయ్య – తేజ కాంబోలో తెరకెక్కే ఎన్టీఆర్ బయోపిక్కు బాలయ్య, ఆయన మిత్రుడు సాయి కొర్రపాటి, సీసీఎల్ విష్ణు ఈ ముగ్గురూ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల్లో కథ ఎలా ఉంటుంది అన్నదానిపై సహజంగానే అందరిలోను ఆసక్తి ఉంటుంది. వర్మ బయోపిక్ అంతా లక్ష్మీపార్వతి కోణంలోనే ఉండనుంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం, ఆయన చివరి రోజులు వర్మ సినిమాలో ఉండనున్నాయి. అయితే ఆయన చివరి రోజుల్లో చాలా కాంట్రవర్సీలు జరిగాయి. అవన్నీ వర్మ టచ్ చేస్తాడా ? లేదా ? అన్నది చూడాలి.
ఇక తేజ బయోపిక్ ఎన్టీఆర్ కెరీర్ నిమ్మకూరులో స్టార్ట్ అయినప్పుడు, ఆయన విద్యాభ్యాసం, ఆయన గుంటూరు విద్య, సినిమాల్లోకి ఎంట్రీ గురించి ముందుగా చూపించి ఆ తర్వాత నేరుగా పొలిటికల్ ఎంట్రీలోకి వెళుతుంది. టీడీపీ ఆవిర్భావం 1983 ఎన్నికల్లో గెలుపు, ఇందిరాగాంధీ ఎన్టీఆర్ గవర్నమెంట్ను కూల్చివేసేందుకు పన్నే కుట్రలు, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, చివరకు 1985 ఎన్నికల్లో గెలిచి ఎన్టీఆర్ సీఎం పీఠం తిరిగి అధిష్టించే వరకు తేజ తెరకెక్కించే బయోపిక్ ఉండనుంది.
ఈ లెక్కన చూస్తుంటే తేజ – బాలయ్య బయోపిక్ క్లైమాక్స్ 1985తో ఎండ్ అయిపోతుంటే వర్మ బయోపిక్ మాత్రం ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకోవడం, 1994లో అధికారంలోకి రావడం, ఆ తర్వాత పరిణామాలు ఉండేలా ఉన్నాయి. ఏదేమైనా వచ్చే యేడాదే ఈ రెండు బయోపిక్లు రిలీజ్ అవుతుండడంతో పెద్ద సంచలనమే..!