రెండు తెలుగు రాష్ట్రాల్లోను వచ్చే ఎన్నికల కోసం సీట్ల ఖర్చీఫ్ వేట అప్పుడే మొదలైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజకవర్గాల్లోను, అన్ని పార్టీలకు చెందిన నాయకుల్లోను కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన రాజమండ్రి లోక్సభ వైసీపీ సీటు కోసం ఇద్దరు కీలక నాయకుల మధ్య ఫైట్ నడుస్తోంది. టిక్కెట్ విషయంలో వీరిద్దరు నేరుగా తలపడకున్నా తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం వీరిద్దరు అదే స్థానంపై కన్నేశారు.
వైసీపీలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రస్తుతం ఆ పార్టీ తరపున ఎమ్మెల్సీగా ఉన్నారు. రామచంద్రపురంలో వరుసగా రెండోసారి ఓడిన బోస్కు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నారు. బోస్ బీసీల్లో బలమైన శెట్టి బలిజ కమ్యూనిటీని ఈస్ట్, వెస్ట్లో లీడ్ చేస్తున్నారు. బీసీల్లో గౌడ ఉపకులాల ఓటర్లు ఈ రెండు జిల్లాల్లో బలంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే రాజమండ్రి నుంచి బోస్ను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దింపితే వైసీపీకి ఈ వర్గాల్లో మంచి ఇమేజ్ రావడంతో పాటు బోస్కు బీసీలందరూ వెన్నుదన్నుగా నిలుస్తారని జగన్ ప్లాన్. ఇక బోస్ కూడా రాజమండ్రి నుంచి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితో ఉన్నట్టు టాక్.
ఇక రాజకీయ ఊసరవెల్లిగా పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీకీ దూరంగా ఉన్న ఉండవల్లి తిరిగి వైసీపీ నుంచి
పొలిటికల్ రీ ఎంట్రికి తహతహలాడుతున్నారు. ఉండవల్లికి రాజమండ్రి ఎంపీ సీటు కన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. దీంతో ఉండవల్లి సైతం ఇదే సీటు కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. జగన్కు ఇద్దరూ కావాల్సిన వాళ్లే. మరి ఈ ఇద్దరిలో ఎవరికి జగన్ రాజమండ్రి ఎంపీ సీటు ఇస్తారో ? చూడాలి.