వల్లభనేని వంశీ మోహన్ ఈ పేరు చెప్పగానే తెలుగు ప్రజల మదిలో పాపులర్ ఫేస్ మెదులుతుంది. దివంగత మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడిగా పేరున్న వంశీ యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వంశీ సాధారణ ఎమ్మెల్యేయే అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లోను క్రేజీ మేన్గా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభకు పోటీ చేసిన వంశీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం గన్నవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వంశీ ఎమ్మెల్యే అవ్వాలన్న తన కోరిక తీర్చుకున్నారు.
వంశీ రాజకీయాలు మిగిలిన రాజకీయ నాయకుల తీరుకు భిన్నంగా ఉంటాయి. అభివృద్ధి, ప్రజల తరపున పోరాటం విషయంలో ముందుంటే ఆయన పేరు కాంట్రవర్సీల్లోను వినిపిస్తుంటుంది. వంశీ ఏం చేసినా ఆయన పేరు స్టేట్ లెవల్లో వినిపిస్తుంటుంది. ఎమ్మెల్యేగా ఈ మూడేళ్లలో వంశీ నియోజకవర్గంలో చాలా పనులు మంజూరు చేయించుకున్నారు. గన్నవరం రాజధాని ఏరియాలో ఉండడం, విజయవాడకు సమీపంలో ఉండడంతో పాటు ఆయన సమర్థతతో ఈ పనుల మంజూరు జరిగింది.
లంకపల్లి – ఉంగుటూరు గ్రామాల మధ్యలో బుడమేరు మీద వంతెన మంజూరైంది. ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య టైం నుంచి పెండింగ్లో ఉన్న ఈ వంతెనకు వంశీ ఎట్టకేలకు మోక్షం కలిగించాడు. ఇక రామవరప్పాడు గ్రామం నుంచి రైల్వేస్టేషన్కు వెళ్లేందుకు ఇప్పటి వరకు ఉన్న ఫుట్పాత్ వంతెన స్థానంలో ఏకంగా ప్రధాన వంతెన మంజూరు చేయించుకున్నాడు. ఇక గన్నవరం నియోజకవర్గంలో వ్యవసాయం సాగుకు మధ్యతరగతి ప్రాజెక్టు అయిన బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు చంద్రబాబు చేత ఓకే చేయించుకున్నారు.
ఇక నియోజకవర్గంలో మండల కేంద్రం అయిన బాపులపాడును దత్తత తీసుకుని రోడ్లన్ని సిమెంట్ రోడ్లుగా వేయించిన ఘనత వంశీదే. ఇక బాపులపాడుకు ఏలూరు కాలువ నుంచి డ్రింకింగ్ వాటర్ పైలెట్ ప్రాజెక్టు మంజరు చేయించాడు. అదే మండలంలోని మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ కేంద్రంలో భూములు ఇచ్చిన రైతులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి తెల్లకార్డు దారుడికి రూ. 50 వేల పరిహారం ఇప్పించిన ఘనత వంశీదే. ఇలా భూములు ఇవ్వకుండా పరిహారం ఇప్పించిన ఘనత స్టేట్లోనే వంశీకి దక్కింది.
వంశీ గన్నవరం నియోజకవర్గంలో జరిగిన ప్రతి భూసేకరణ విషయంలో రైతుల తరపుప పోరాడి వారికి ఎక్కువ పరిహారం ఇప్పించడంలో కృషి చేశారు. రైతులను నేరుగా చంద్రబాబు వద్దకే తీసుకువెళ్లారు కూడా. నియోజకవర్గంలో ఓవరాల్గా వంశీకి మైనస్ల కంటే ప్లస్లే ఎక్కువుగా ఉన్నాయి. ఇక రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో వైసీపీ చాలా వీక్గా ఉండడం కూడా కలిసి రానుంది.
ప్లస్ పాయింట్స్ (+):
– పోలవరం కాలువలో భూములు కోల్పోయిన రైతులకు అంచనాలకు మించిన రేటు ఇప్పించడం
– మెట్ట ప్రాంతానికి నీళ్లు ఇప్పించడానికి కృషి, పోలవరం కాలువ నుంచి మోటార్లతో నీళ్లు తోడి చెరువులు నింపించడం
– ప్రతి గవర్నమెంట్ పథకం అమలులో గన్నవరం నియోజకవర్గం టాప్ ప్లేస్లో నిలవడం
– పెన్షన్లు, ఇళ్ల మంజూరులో జిల్లాలోనే గన్నవరం నెంబర్ వన్ ప్లేసులో ఉండడం
– ఎయిర్పోర్ట్ భూముల విషయంలో రైతులకు అనుకూలంగా, ప్రభుత్వంపై పోరాటం చేసి రైతులకు న్యాయబద్ధమైన రేటు ఇప్పించడం
– నియోజకవర్గంలో వైసీపీ చాలా వీక్గా ఉండడం
– దళితవాడల్లో పర్యటనలు రాజకీయంగా చాలా ప్లస్
– జనసేన ప్రభావం నియోజకవర్గంలో లేకపోవడం
మైనస్లు (-):
– పార్టీలో టీడీపీ వాళ్ల కంటే వైసీపీ వాళ్లకు పనులు
– పాత తెలుగుదేశం నాయకులను కలుపుకుని వెళ్లకపోవడం
తుది తీర్పు:
ఈ మూడేళ్ల పాలనలో గన్నవరం ఎమ్మెల్యేగా వంశీ నిత్యం ప్రజలకు టచ్లో ఉండడంతో పాటు చాలా అభివృద్ధి పనులు చేయించారు. కొన్ని మంజూరు చేయించారు. ఓవరాల్గా రైతుల పక్షపాతిగా ఉన్న వంశీ వాళ్లు మెచ్చే పనులు చాలా చేశారు. రైతుల పక్షాన పోరాడే విషయాల్లో వంశీ సొంత ప్రభుత్వంపైన కూడా గట్టిగానే ఫైట్ చేశారు. ఇక నియోజకవర్గంలో వైసీపీ వీక్, జనసేన ప్రభావం లేకపోవడం ఆయనకు బాగా కలిసిరానుంది. వంశీ పార్టీ మారతారని వార్తలు వస్తున్నా, అవి గాలివాటం వార్తలుగానే ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయనకు గ్యారెంటీగా టిక్కెట్టు రావడం ఖాయం. ప్రస్తుతానికి అయితే వంశీ రెండోసారి గెలిచేందుకు పెద్ద ఆటంకాలు అయితే లేవు.