టీడీపీ కంచుకోట‌లో వైసీపీకి ఊపొచ్చిందే

వ‌రుస వైఫ‌ల్యాల‌తో కునారిల్లుతున్న ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీలో అనూహ్యంగా ఊపొచ్చింది. అధికార టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి నేత‌లు ఇప్పుడు జ‌గ‌న్ చెంత‌కు చేరుతున్నారు. ఈ ప‌రిణామాన్ని అస‌లు వైసీపీ నేత‌లు ఎవ‌రూ ఊహించ‌లేదు. దీంతో వారు ఒక్క‌సారిగా ఇప్పుడు ఉబ్బి త‌బ్బిబ్బ‌వుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో టీడీపీ హ‌వా అంతా ఇంతా కాదు. వైసీపీ పెద్ద బ‌లంగా లేదు. మొన్న‌టికి మొన్న తూర్పోగోదావ‌రి జిల్లా కాకినాడ‌లో జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ చావుత‌ప్పించుకోడానికి వైసీపీ నానా తిప్ప‌లు ప‌డింది. 

అలాంటి జిల్లాల నుంచి కొంద‌రు మంచి ప‌లుకుబ‌డి ఉన్న‌వారు, స్థానికంగా గుర్తింపు ఉన్న‌వారు ఇప్పుడు జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలోకి వచ్చారు.  తూర్పుగోదావరి  జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్‌పాండ్‌లో వైసీపీ అధ్యక్షుడు జ‌గ‌న్ క‌లిసి.. మ‌న‌సులో మాట చెప్పారు. దీనికి ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన జ‌గ‌న్‌.. వెంట‌నే పార్టీలోకి చేర్చుకున్నారు. రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసి  సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ  పిల్లి సుబాష్‌చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ కోఆర్డినేటర్‌ చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు.

అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్‌ నరసింహరాజు కూడా వైసీపీలో చేరారు. ఈయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే జ‌గ‌న్‌ను వాటేసుకుని ముద్దులు పెట్టినంత ప‌నిచేశార‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ వెంట‌నే జ‌గ‌న్ ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు.  ఎమ్మెల్సీ ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాతపాటి సర్రాజు, కారుమూరి నాగేశ్వరరావు, బలరామరాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఇక‌, ఈ చేరిక‌ల‌తో ఉభయ గోదావ‌రుల‌పై మ‌రింత ప‌ట్టు పెరుగుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మ‌చారం.