వైసీపీలో కర్త, కర్మ, క్రియ అంతా ఎవరంటే ముక్తకంఠంతో వినిపించే పేరు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి! మరి ఆయన తర్వాత? ఎవరు అంటే కొంత ఆలోచించాల్సిందే! ఇప్పటివరకూ ఆ అవసరమే రాలేదు కూడా! కానీ పార్టీలో క్రమక్రమంగా, చాపకిందనీరులా ఒక వ్యక్తి మాత్రం.. షాడో జగన్లా మారిపోయారు. అధినేత కూడా తన మీద ఆధారపడేలా చేసేసుకున్నారు. ఇక జగన్ బంధువులను.. ఆయా నియోజకవర్గాలకే పరిమితం చేసేశారు! సీనియర్లను కూడా జగన్ దగ్గరికి రానివ్వకుండా వాళ్లని తొక్కేస్తున్నారు. మరి ఇంతలా మారిపోయిన వ్యక్తి మరెవరో కాదు.. ఎంపీ విజయ సాయిరెడ్డి!! ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా ఆయనే వైసీపీలో షాడో జగన్!!
వైసీపీలో అంతా సింగిల్ మ్యాన్ షోనే! ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాలన్నా.. దానిని అమలు చేయాలన్నా.. దానిని పెండింగ్లో పెట్టాలన్నా అంతా జగనే! సీనియర్లు ఉన్నా.. వారు కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితమైపోయారు! కానీ ఇప్పుడు జగన్ తర్వాత.. ఆ స్థాయిలో రాజకీయాలు చేస్తూ.. పార్టీ వ్యవహారాలను నడుపుతున్న వ్యక్తి ఎంపీ విజయసాయిరెడ్డి! ఢిల్లీలో ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యేలా చేయడంలో కీలకంగా వ్యవహరించడం దగ్గర నుంచి.. రాష్ట్రపతి అభ్యర్థిని కలవడం. శిల్పా మోహనరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం వరకూ.. ఆయనే అన్నీ చూసుకుని పార్టీలో జగన్ తర్వాతి స్థానాన్ని భర్తీ చేస్తున్నారు.
జగన్ కుటుంబ సభ్యులు ఎవరూ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. విజయమ్మ ఇంటికే పరిమితమయ్యారు. షర్మిల రాజకీయాలను పట్టించుకోవడం లేదు. జగన్ బంధువులు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డిని జగన్ ప్రకాశం జిల్లాకే పరిమితం చేశారు. జగన్ చేసే దీక్షలు, మహాధర్నాలు, ప్లీనరీలను ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. గతంలో జగన్ ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి, మైసూరారెడ్డి, సోమయాజులు వంటి వారిపైనే ఆధారపడే వారు. కీలక అంశాలను వారితోనే చర్చించేవారు. ఇప్పుడు ఆ స్థానాన్ని సాయిరెడ్డి దక్కించు కున్నారు. ఆర్థికంగానేగాక రాజకీయపరమైన సలహాలు కూడా విజయసాయిరెడ్డి నుంచే జగన్ తీసుకుంటున్నారు.
పార్టీ ఆర్థిక వ్యవహారాలతో పాటుగా పార్టీ సమస్యలను కూడా చక్కగా డీల్ చేస్తుండటంతో విజయసాయిరెడ్డికి జగన్ అగ్రస్థానం కట్టబెట్టారు. ఇక ఢిల్లీ వ్యవహారాలను కూడా సాయిరెడ్డి చక్కగా ట్యాకిల్ చేశారు. ఇటీవల ప్రధాని మోడీని జగన్ కలవడం ఒక్క సాయిరెడ్డికి తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో నేతలు కూడా ఎక్కువగా విజయసాయిరెడ్డిని కలవడానికే ఇష్టపడుతున్నారు. జగన్ ను సీఎంను చేసే సమర్ధత, చాకచక్యం సాయిరెడ్డిలో ఉన్నాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద జగన్ షాడోగా విజయసాయిరెడ్డి మారిపోయారు.