కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఖిల్లా. కడప జిల్లా నుంచే ప్రారంభమైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజకీయాలతో పాటు సమైక్యాంధ్ర రాజకీయాలు, చివరిగా ఢిల్లీ రాజకీయాలను సైతం (అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఢిల్లీలోను హవా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఈ మూడు ఎన్నికల్లోను జిల్లాలోని కడప, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్కసారి కూడా టీడీపీకి రాలేదు.
ఇక 2009 ఎన్నికల్లో వైఎస్ గాలిలో జిల్లాలో ఒక్క ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీ గెలుచుకుంటే, గత ఎన్నికల్లో రాజంపేట మాత్రమే టీడీపీ గెలిచింది. ఇదంతా వైఎస్ ఫ్యామిలీకే చెందే క్రెడిట్. అలాంటి కంచుకోటకు ఇప్పుడు క్రమక్రమంగా బీటలు వారుతున్నట్టే కనిపిస్తోందని రాజకీయవర్గాలు చెపుతున్నాయి.
వైఎస్.జగన్ జిల్లాను పట్టించుకోకపోవడంతో పాటు గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టడంలో విఫలమవ్వడం, ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు తమ పార్టీ ప్రజాప్రతినిధులను టీడీపీ వైపునకు వెళ్లకుండా బ్రేక్ వేయడంలో కూడా ఆయన ఫెయిల్ అవ్వడం లాంటి అంశాలు అక్కడ వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోవడానికి మెయిన్ రీజన్స్గా చెపుతున్నారు.
జగన్ ఇటీవల జిల్లా పర్యటనకు వస్తే కేవలం పులివెందులకే మాత్రమే పరిమితమవుతున్నారు. పులివెందుల సమస్యలు మాత్రమే తెలుసుకుంటున్నారు..తప్ప జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎలా ఉంది ? అక్కడ ప్రజల సమస్యలు ఏం ఉన్నాయి ? ఆ నియోజకవర్గాల ప్రజల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడకపోవడం లాంటి అంశాలు జగన్ గ్రాఫ్ రోజు రోజుకు బాగా డౌన్ అవ్వడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.
తాము ప్రతిసారి వైఎస్ ఫ్యామిలీకి పట్టంకడుతున్నా ప్రస్తుతం జగన్ తీరుతో జిల్లా జనాల్లో అసంతృప్తి నెలకొంది. ప్రస్తతుం జిల్లాలో ఎన్నికలు జరిగితే టీడీపీ సిట్టింగ్ సీటు రాజంపేటతో పాటు బద్వేల్, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు అంత వీజీ కాదంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం జగన్ బాబాయ్ వైఎస్.వివేకా ఓడిపోయారు. మరి ఇప్పటికైనా జగన్ పార్టీ పరంగాను, కడప జిల్లా సమస్యలపైనా పోరాటం చేయకపోతే వచ్చ ఎన్నికల్లో ఇక్కడ జగన్కు షాక్ తప్పేలా లేదు.