సీఎం చంద్రబాబు అమరావతి కలలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. ఏ ముహూర్తాన ఆయన అమరావతికి ప్లేస్ డిసైడ్ చేసుకున్నాడో.. అప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన అమరావతి కోసం చేసిన ల్యాండ్ పూలింగ్పై ప్రపంచ బ్యాంకు తనిఖీ కొరడా ఝళిపిస్తోంది.
బాబు చేసిన ల్యాండ్ పూలింగ్తో తాము నష్టపోయామని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. మొదట్లో బ్యాంకు అధికారులు ఇది మామూలే కదా అనుకున్నా.. లేఖల పరంపర పెరిగే సరికి అనుమానం వచ్చింది. దీంతో రేపో మాపో తనిఖీలకు సిద్ధమైపోయారు.
ఇలా ఎందుకు జరిగిందంటే.. అమరావతి ప్రాంతం అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కోరారు. సుమారు 3400 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. దీనికి అంగీకరించిన బ్యాంకు.. మౌలిక సదుపాయాల కల్పనను నేరుగా తామే నిర్వహిస్తామని రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే రైతులు బ్యాంకును ఆశ్రయించి.. బాబు గారి నిర్వాకం బయట పెట్టారు. అమరావతి భూముల విషయంలో తన అనుకున్న వారికి మాత్రమే నష్టపరిహారం అందిందని, తమకు అన్యాయం జరిగిందని, పూలింగ్లో మేం ఇవ్వకపోయినా బలవంతంగా లాక్కుని పూలింగ్ అంటూ ప్రచారం చేస్తున్నారని లేఖల్లో పేర్కొన్నారు.
అంతేకాదు, రాజధాని భూములు అత్యంత సారవంతమైనవని, వాటిలో ఏడాదికి మూడు పంటలు పడుతున్నాయని, అలాంటి వాటిని బాబు అండ్కోలు అవసరానికి మించి బలవంతంగా లాగేసుకున్నారని, అదేసమయంలో ఈ ప్రాంతానికి కొండవీటి వాగుతో పెద్ద ప్రమాదం ఉందని కూడా రైతులు బ్యాంకుకు వివరించారు. ఇక, రుణం ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో ఈ లేఖల పరంపర పెరిగే సరికి ప్రపంచ బ్యాంకు ఇండియా విభాగం చైర్మన్ అలెర్టయి.. విషయాన్ని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు కిమ్కి చెప్పారు.
దీంతో ఆయన అసలు ఏం జరుగుతోందో తెలుసోకావలంటూ.. తనిఖీ నిర్వహించాలని వారికి ఆదేశించారు. దీంతో రెండు మూడు వారాల్లో ప్రపంచ బ్యాంకు నుంచి తనిఖీ బృందం ఒకటి రాజధాని ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని తెలుసుకోనుంది. ఈ బృందం ఇచ్చే నివేదిక ప్రకారమే బ్యాంకు నుంచి అప్పుపుట్టి.. బాబు కలలు నెరవేరతాయి.