య‌న‌మ‌ల‌ను టెన్ష‌న్ పెడుతున్న రెడ్డి గారు ఎవ‌రు..!

టీడీపీని బ‌లోపేతం చేయాల‌ని ఆపార్టీ అధినేత‌ చంద్ర‌బాబు ఒక‌పక్క పిలుపునిస్తున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో ఆయ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, ఇతర పార్టీల నుంచి వ‌చ్చే వారికి కూడా ఆహ్వానం ప‌ల‌కాల‌ని, ఈ విష‌యంలో సీనియ‌ర్లు స‌హ‌క‌రించాల‌ని పార్టీ వ‌ర్క్ షాపు పెట్టి మ‌రీ ఆయ‌న చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్‌, వైసీపీల నుంచి వ‌చ్చే వారికి ఎలాంటి ప‌రిస్థితిలోనూ అడ్డు చెప్పొద్ద‌ని ఆయ‌న అన్నారు. అయితే, సాక్షాత్తూ.. ఆర్థిక మంత్రి, బాబుకు రైట్ అని పిలిపించుకునే య‌న‌మ‌ల రామ‌కృష్ణుడే.. ఒక నేత విష‌యంలో టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌.

విష‌యంలోకి వెళ్తే.. కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ పెద్ద కాంట్రాక్ట‌ర్‌. యనమల రామకృష్ణుడికి ఈయ‌న వియ్యంకుడు కూడా. మైదుకూరులో టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో సుధాకర్ యాదవ్ ఓటమి చవిచూశారు. ఇదిలావుంటే, ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. పార్టీ మారాల‌ని డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీలోకి వెళ్తార‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, ఇంత‌లోనే ఆయ‌న త‌న ప్లేట్ మార్చుకున్నారు. టీడీపీలోకి రావాల‌ని డిసైడ్ అయ్యారు. డీఎల్ క‌నుక టీడీపీలోకి వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కే ఎమ్మెల్యే సీటు ఖ‌రార‌య్యే ఛాన్స్ ఉంది. దీంతో ఈ ప‌రిణామం ఇప్పుడు సుధాక‌ర్ రెడ్డికి కంటిపై కునుకులేకుండా చేస్తోంది. దీంతో సుధాక‌ర్ ఇప్పుడు త‌న వియ్యంకుడు య‌న‌మ‌ల ద్వారా.. డీఎల్ పార్టీలోకి చేర‌కుండా నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

కానీ, డీఎల్ మాత్రం ఎంత త్వ‌ర‌గా అయితే, అంత త్వ‌ర‌గా.. టీడీపీ సైకిల్ ఎక్కేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. దీంతో ఇప్పుడు య‌న‌మ‌ల టెన్ష‌న్ ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వియ్యంకుడు పుట్టాకు సీటు ఇప్పించుకోవాల‌ని ఈయ‌న‌కూడా అనుకున్నారు. అయితే, ప‌రిణామం తీవ్రంగా మారుతుండ‌డంతో య‌న‌మ‌ల‌కు ఏం చేయాలో అర్ధంకాని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు.