ప్ర‌జ‌ల మ‌నిషి ‘ య‌ర‌ప‌తినేని ‘ ప్ల‌స్సులు – మైన‌స్‌ల లెక్క ఇదే

గుంటూరు జిల్లా టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల్లో య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ఒక‌రు. ఏపీలోనే అత్యంత సంక్లిష్ట‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి అయిన గుర‌జాల నుంచి మూడుసార్లు గెలిచిన య‌ర‌ప‌తినేని సీఎం చంద్రబాబుకు అత్యంత న‌మ్మ‌క‌మైన వ్య‌క్తి. జిల్లాలో చాలా మంది సీనియ‌ర్లు ఉన్నా చాలా సంద‌ర్భాల్లో బాబు య‌ర‌ప‌తినేని మాటే న‌మ్ముతారు. ఆయ‌న మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయ‌నకు అంత‌కుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ఆయ‌న కూడా మంత్రి ప‌ద‌వి ఆశించారు. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు. ఈ ప‌ద‌వి రాని సీనియ‌ర్లు అలక‌ బూని అధిష్టానంతో పాటు, చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. య‌ర‌ప‌తినేని మాత్రం చాలా కూల్‌గా ఉన్నారు.

ఆ త‌ర్వాత లోకేష్ అయితే అన్నా నీలాంటి క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న ప్ర‌జాప్ర‌తినిధులు నాకు ఎంతో ఆద‌ర్శం… నీకు ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా నేను అండ‌గా ఉంటాన‌ని చెప్పారు. సీఎం చంద్ర‌బాబు కూడా శ్రీను ప‌ని చెప్పాడంటే వెంట‌నే చేయాల‌ని అధికారులకు ఆదేశాలిచ్చేస్తారు. ఇక ఎమ్మెల్యేగా ఈ మూడున్న‌రేళ్ల‌లో య‌ర‌ప‌తినేని అంచ‌నాల‌కు మించి నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు రాబ‌ట్ట‌డంతో సక్సెస్ అయ్యారు. జిల్లాలో మంత్రులు, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులకే సాధ్యం కాని రీతిలో గుర‌జాల‌కు నిధులు పోటెత్తాయి.

– నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క‌మైన బుగ్గ‌వాగు రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 5 టీఎంసీల‌కు విస్త‌రించేందుకు ఆయ‌న రూ. 420 కోట్లు మంజూరు చేయించారు. ఈ రిజ‌ర్వాయ‌ర్ గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు తాగు, సాగు నీరు కూడా అందిస్తుంది.

– నియోజ‌క‌వ‌ర్గంలో సాగుకు కీల‌కమైన సాగ‌ర్ కాల్వ‌ల ఆధునికీక‌ర‌ణ‌కు రూ.100 కోట్లు మంజూరు చేయించారు.

– పులిచింత‌ల ప్రాజెక్టు నిర్వాసితుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన ప‌రిహారం కాకుండా ఆయ‌న సీఎంతో మాట్లాడి అద‌నంగా రూ. 100 కోట్లు మంజూరు చేయించారు.

– గోవింద‌పురం నుంచి పిడుగురాళ్ల మునిసిపాలిటీకి తాగునీరు అందించే ప‌థ‌కానికి రూ. 20 కోట్లు మంజూరయ్యాయి.

– ఇక కీల‌క ప్రాజెక్టుల్లో బుగ్గ‌వాగు నుంచి గురజాల నియోజ‌క‌వ‌ర్గానికి అంతా తాగునీరు అందించేందుకు రూ. 320 కోట్లకు అనుమ‌తులు కూడా వ‌చ్చేశాయి.

– ఈ మూడున్న‌రేళ్ల‌లో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఓవ‌రాల్‌గా రూ. 1200 కోట్లు మంజూరు చేయించుకున్నారు.

– హ‌జ్ యాత్రికుల‌కు ఇటీవ‌ల మ‌నిషికి ల‌క్ష చొప్పున ఇవ్వ‌డం.

రాజ‌కీయ బ‌లం ఎలా ఉంది…

రాజ‌కీయంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ ఫుల్ క‌న్‌ఫ్యూజ్‌లో ఉంది. య‌ర‌ప‌తినేనికి పెద్ద‌గా యాంటీ లేక‌పోవ‌డం, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 20 ఏళ్లుగా య‌ర‌ప‌తినేనికి యాంటీగా రాజ‌కీయాలు చేస్తోన్న జంగా కృష్ణ‌మూర్తిని జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేయ‌డం య‌ర‌ప‌తినేనికి బాగా క‌లిసిరానుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుర‌జాల నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కాసు వెంక‌ట కృష్ణారెడ్డి త‌న‌యుడు మ‌హేష్‌రెడ్డి పోటీ చేస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆయ‌న నాన్ లోకల్ కావ‌డం మైన‌స్‌. ఇక గుర‌జాల కాసు ఫ్యామిలీకి క‌లిసి రాలేదు. గ‌తంలో మ‌హేష్ తాత‌, ఆ త‌ర్వాత మ‌హేష్ నాన్న ఇక్క‌డ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హేష్‌రెడ్డి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు. ఆయ‌నకు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం కొత్త‌. ఇక బీసీల్లో బ‌ల‌మైన నాయ‌కుడు అయిన జంగాను జ‌గ‌న్ త‌ప్పించ‌డంతో ఆ వ‌ర్గాలు జ‌గ‌న్‌పై గుర్రుగా ఉన్నాయి. అది కూడా య‌ర‌ప‌తినేనికి ప్ల‌స్ పాయింటే.

ఈ విష‌యాల్లో మాత్రం క‌ష్ట‌మే…

య‌ర‌పతినేనికి కొన్ని విష‌యాల్లో మైన‌స్‌లు కూడా ఉన్నాయి. పార్టీ కోసం ఎప్ప‌టి నుంచో ప‌నిచేసే వారి కంటే ముఖ‌స్తుతి చేసేవాళ్ల ప‌నులు ఎక్కువ చేస్తున్నార‌న్న అప‌వాదు ఉంది. దీంతో మిగిలిన వాళ్లు కాస్త అస‌హ‌నంతో ఉన్నారు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– వివాద ర‌హితుడు, సౌమ్యుడు అన్ని వ‌ర్గాలు, కులాల్లో మంచి గ్రిప్‌

– పార్టీకి, చంద్ర‌బాబుకు అత్యంత విధేయుడు

– చంద్ర‌బాబు స్టేట్‌లో న‌మ్మే వ్య‌క్తుల్లో ప్ర‌థ‌మ స్థానం

– ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌లో వైసీపీ ఎమ్మెల్యేల‌ను సైకిలెక్కించ‌డంలో కీల‌క పాత్ర‌

– ప‌ల్నాడులోని కీల‌క‌మైన గుర‌జాల నుంచి మూడుసార్లు గెల‌వ‌డం

– మంత్రి కాక‌పోయినా ఆ స్థాయిలో ప‌నులు చేయించుకోగ‌ల స‌త్తా

– నియోజ‌క‌వ‌ర్గంలో రైతులు, కార్మికులు, అన్ని వ‌ర్గాల‌కు ప‌నులు చేయించ‌డం

– వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కే ధీటుగా స‌వాల్ విసిరే నేత‌గా గుర్తింపు

– జిల్లాలో అంద‌రూ ఎమ్మెల్యేల‌తో స‌న్నిహితంగా ఉంటూ గ్రూపు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌డం

– పార్టీల‌కు అతీతంగా ప‌నులు చేయ‌డం

– వైసీపీ అభ్య‌ర్థి కాసు మ‌హేష్‌రెడ్డి స్థానికేత‌రుడు కావ‌డం

మైన‌స్ పాయింట్స్ (-):

– పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారికి ప్రాధాన్య‌త త‌గ్గించ‌డం

– ప‌దే ప‌దే కోట‌రీ వ్య‌క్తుల‌కే ప‌నులు చేయడం

– నియోజ‌క‌వ‌ర్గంలో అక్క‌డ‌క్కడా ఉన్న స్పీక‌ర్ కోడెల వ‌ర్గంతో గ్యాప్‌

తుది తీర్పు:

మూడుసార్లు గెలిచిన య‌ర‌ప‌తినేని 2019 ఎన్నిక‌లకు మ‌రోసారి రెడీ అయిపోతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ ప్ర‌జ‌ల మ‌నిషిగా పేరు తెచ్చుకోవ‌డం, నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయ‌లు మంజూరు చేయ‌డం ఆయ‌న‌కు చాలా ప్ల‌స్‌గా ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థులు, ప్ర‌తిప‌క్ష పార్టీ బ‌ల‌హీనంగా ఉండ‌డం కూడా ఆయ‌న‌కు ప్ల‌స్సే. అయితే జ‌న‌సేన సొంతంగా పోటీ చేస్తే నియోజ‌క‌వ‌ర్గంలో 15 వేల ఓట్ల‌కు కాస్త అటూ ఇటూగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లు జ‌న‌సేన ఎంత వ‌ర‌కు చీలుస్తుంద‌న్న‌ది చూడాలి. య‌ర‌ప‌తినేని ప్ర‌స్తుతం ఉన్న ఫామ్‌నే కంటిన్యూ చేస్తే ఆయ‌న‌కు ఎవ‌రెన్ని ఓట్లు చీల్చినా ఇబ్బందేమి ఉండ‌దు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు టార్గెట్ ఒక్క‌టే కాకుండా భారీ మెజార్టీయే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు.

yarapathineni sreenivasarao