ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది.
ఏపీలో మహాకూటమిని ఏర్పాటు చేస్తే విజయం తథ్యమని, బీజేపీ, టీడీపీ కూటమిని సులువుగా ఓడించవచ్చని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్. ఈ మహాకూటమి ఏర్పాటు ఎంత వరకు సాధ్యమవుతుందన్నది చెప్పలేకపోయినా ఈ కూటమిలో వైసీపీ+జనసేన+కామ్రేడ్లు కలవాలని ప్రశాంత్ జగన్కు చెప్పారట. పవన్ ఈ సారి ఏపీలో ఎలాగూ టీడీపీ+బీజేపీ కూటమితో జట్టుకట్టే సూచనలు లేవు.
ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఈ రెండు పార్టీలపై ఫైర్ అవుతోన్న జనసేన ఈ రెండు పార్టీలకు దూరంగానే ఉండనున్నాడు. మరి ఈ టైంలో జనసేన+వైసీపీ కలిస్తే బాగుంటుందని ప్రశాంత్ జగన్కు సూచించాడట. ఇక జగన్ కామ్రేడ్లతో కలిసేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జగన్ పార్టీతో జనసేనను జతకట్టించేందుకు కోస్తా జిల్లాకు చెందిన ఒక సీనియర్ కాపునేత రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన, కమ్యునిస్టులు కలసి పోరాటం చేస్తే వైసీపీ గెలుపు ఖాయమని ప్రశాంత్ చెప్పిన సూచనలపై జగన్ ఇప్పటికే పార్టీలోని సీనియర్లతో చర్చించారని వైసీపీ వర్గాల ఇన్నర్ టాక్.
మనం జనసేన, కామ్రేడ్లతో జట్టుకడితే మనకు రాజకీయంగా వచ్చే లాభ,నష్టాలపై తనకు ఓ నివేదిక ఇవ్వాలని కూడా జగన్ సీనియర్ నేతలకు సూచించాడట. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుతుందో తెలియదు గాని…ఏపీలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్నది వాస్తవం.