నంద్యాల‌లో మారిన వైసీపీ వ్యూహం

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ వైసీపీ ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రిస్తుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వాస్త‌వానికి ఇక్క‌డ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున భూమా నాగిరెడ్డి విజ‌యం సాధించారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు సైకిలెక్కిన ఆయ‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముందే గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. భూమా మృతి త‌ర్వాత జ‌గ‌న్ ఇది వైసీపీ సీటు…ఇక్క‌డ వైసీపీ ఉప ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్య‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.

అయితే కొద్ది రోజులుగా ఇక్క‌డ భూమా ఫ్యామిలీపై ఉన్న సానుభూతితో జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి ఉప ఎన్నిక ఏక‌గ్రీవానికి కృషి చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్తలు ఇలా ఉండ‌గానే అనూహ్యంగా వైసీపీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేసింది. నంద్యాల ఉప ఎన్నిక‌లో వైసీపీ అభ్య‌ర్థిగా పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ మ‌ల్కిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి బ‌రిలో ఉంటార‌ని మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రామిరెడ్డి ప్ర‌క‌టించారు.

షాక్ ఏంటంటే టీడీపీ నుంచి కాట‌సాని రామిరెడ్డి అల్లుడు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి రేసులో ఉంటాడ‌ని వార్త‌లు వ‌స్తోన్న టైంలో అదే కాట‌సాని చేత వైసీపీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టింప‌జేసి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నంద్యాల నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ ఆదివారం మున్సిపల్‌ టౌన్‌ హాల్‌లో జరిగింది. ఈ సమావేశంలోనే కాట‌సాని అనూహ్యంగా నంద్యాల వైసీపీ అభ్య‌ర్థిపై ప్ర‌క‌ట‌న చేశారు.

టీడీపీ అభ్యర్థిగా భూమా వర్గం తరుపున రేసులో ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డికి కాటసాని స్వయాన మామ. వైసీపీ గెలుపుకోసం తామంతా క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. రేపు టీడీపీ అభ్య‌ర్థిగా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి రేసులో ఉంటే నంద్యాల ఉప ఎన్నిక సాక్షిగా మామ, అల్లుళ్ల పోరు అదిరిపోవ‌డం ఖాయం.